Kejriwal: పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి దిల్లీ సీఎం ఆతిథ్యం
దిల్లీ: ఇటీవల గుజరాత్(Gujarat) పర్యటనలో ‘మా ఇంటికి వస్తారా సార్’? అని అడిగిన ఓ ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లి భోజనం చేసిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal) ఈసారి దళిత వర్గానికి చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చారు. గుజరాత్కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు హర్ష్ సోలంకి కుటుంబంతో కలిసి సీఎం భోజనం చేసిన ఆసక్తికర ఘటన సోమవారం దిల్లీలో జరిగింది. నిన్న అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు హర్ష్ సోలంకి తన కుటుంబంతో కలిసి ఈరోజు దిల్లీకి వెళ్లారు. దిల్లీ విమానాశ్రయంలో ఆ కుటుంబానికి ఎంపీ రాఘవ్ చద్దా సాదర స్వాగతం పలికారు. అనంతరం దిల్లీలోని ప్రభుత్వ పాఠశాల, ఆస్పత్రులను సందర్శించారు. తన ఇంటికి చేరుకున్న హర్ష్ సోలంకిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేజ్రీవాల్.. ఆ కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా హర్ష్ సోలంకి కేజ్రీవాల్కు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాఘవ్ చద్దాతో పాటు పలువురు ఆప్ నేతలు కూడా ఉన్నారు. ఈ విందుకు సంబంధించిన చిత్రాలను సీఎం తన ట్విటర్లో పంచుకున్నారు. హర్ష్ సోలంకి కుటుంబానికి తమ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలు కలిసి భోజనం చేశాయని, ఆ కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు.