కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు
- కొండగట్టులో అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తా - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. కొండగట్టులో అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. యాదాద్రిలాగే కొండగట్టును కూడా అభివృద్ధి చేస్తామని, ప్రఖ్యాత స్థపతులను తీసుకొస్తామన్నారు. ఇప్పటికే 384 ఎకరాలు అంజన్న దేవాలయానికి మంజూరు చేశామన్నారు. తెలంగాణలో పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటినీ అభివృద్ధి చేసుకుందామన్నారు. అంతేకాదు బండలింగాపూర్ను మండలంగా ఏర్పాటు చేస్తామని జగిత్యాలలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో చెప్పారు. అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు. తాను బతికి ఉన్నంతవరకూ రైతుబంధు, రైతుబీమా ఆగదని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాకే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం పుష్కరాలు కూడా జరిపేవారు కాదన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు.భారతీయ జనతా పార్టీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేసీఆర్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. దేశంలో పదివేల పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. ఏటా పదివేల మంది పారిశ్రామికవేత్తలు దేశాన్ని వీడిపోతున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వందేళ్లు వెనకబడిపోతామన్నారు. మోదీ వచ్చాక తెలంగాణకు ఒక్క మంచి పని కూడా జరగలేదన్నారు. ఎల్ఐసీని కూడా అమ్మేందుకు యత్నిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలన్నారు.అంతకు ముందు కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్నివర్గాలకు మేలు జరుగుతోందని, అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ప్రజలందరి సమిష్టి కృషితోనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.