ఈవ్టీజింగ్, మహిళల వేధింపుల కేసులో 125 మంది అరెస్ట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
హైదరాబాద్లో మహిళల భద్రతకోసం ఏర్పాటు చేసిన షీ టీమ్ బృందాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. ఆకతాయిల వేధింపుల గురించి సమాచారం అందిన వెంటనే షీ టీమ్స్ రంగంలోకి దిగడమే కాకుండా మహిళలు, అమ్మాయిలకు భరోసాని ఇస్తున్నాయి. ఈ ఆరువారాల్లో షీ టీమ్స్ బృందాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల్ని వేధిస్తున్న125 మందిని అరెస్ట్ చేశాయి. దాదాపు 91మందిపై కేసు నమోదుచేశామని, 28 మందిపై ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేశామని చెప్పారు షీ టీమ్స్ అధికారి. నేరుగా, వాట్సాప్ నెంబర్ ద్వారా, వెబ్సైట్ ద్వారా అందని ఫిర్యాదుల ఆధారంగా మహిళల్ని వేధిస్తున్న వాళ్లను అరెస్ట్ చేశామని షీ టీమ్స్ అధికారులు చెప్పారు.
74 మంది మైనర్లు
మెట్రో స్టేషన్లు, పనిచేసే చోట, కాలేజీల్లో ఆకతాయిల వేధింపులపై షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు కొందరు. దాంతో, రంగంలోకి దిగిన షీ టీమ్స్ ఆరువారాల్లో 125మందిని అరెస్ట్ చేశాయి. వీళ్లలో స్కూల్ టీచర్తో సహా 74మంది మైనర్లు ఉన్నారు. మహిళల్ని వేధిస్తూ పట్టుబడ్డ వీళ్లకు ఎల్బీనగర్లోని కమిషనరేట్ కార్యాలయంలో కౌన్సిలర్లు,సైకాలజిస్ట్లతో కౌన్సెలింగ్ ఇప్పించనున్నారు. మైనర్లకు మాత్రం విడిగా కౌన్సెలింగ్ ఇప్పించనున్నారు. షీ టీమ్స్కి పట్టుడ్డ వాళ్లందరూ ఈ కౌన్సెలింగ్ సెషన్కు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు అధికారులు.
155 బాల్యవివాహాల్ని అడ్డుకున్నాయి
మెట్రో స్టేషన్లలో మహిళల కోసం కేటాయించిన కంపార్ట్మెంట్లలో ప్రవేశించిన 12మందికి షీ టీమ్స్ ఫైన్లు వేశాయి. అంతేకాదు తమ బృందాలు గత ఆరువారాల్లో మూడు బాల్యవివాహాల్ని ఆడ్డుకున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకూ 155 బాల్యవివాహాలు జరగకుండా చూశామని షీ టీమ్స్ అధికారి ఒకరు చెప్పారు. ఈవ్టీజింగ్ వంటి వేధింపుల గురించి మహిళలు, అమ్మాయిలు 100 నెంబర్కు ఫోన్ చేసి లేదా వాట్సాప్ నెంబర్ 9490617111 ద్వారా ఫిర్యాదు చేయాలని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కోరారు.