కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం ఏపీకి చెందిన 13 మంది మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటకలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిక్కబళ్లాపూర్ వద్ద సిమెంట్ మిక్సర్ లారీని వెనుక నుంచి టాటా సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన 13 మంది మృతిచెందారు. దట్టంగా కురుస్తోన్న పొగ మంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయానికి టాటా సుమోలో మొత్తం 18 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.ప్రమాదానికి గురైన వాహనంపై ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉందని, మృతులంతా ఏపీకి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. బాధితులు బాగేపల్లి నుంచి చిక్కబళ్లాపూర్‌కు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. బాగేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సిమెంట్ మిక్సర్ లారీ ఆగి ఉండగా.. వేగంగా వస్తున్న టాటా సుమో వెనుక నుంచి ఢీకొట్టిందని చెప్పారు. పొగ మంచు దట్టంగా కురుస్తుండటంతో ఆగి ఉన్న వాహనాన్ని డ్రైవర్ గమనించలేకపోయాడని అన్నారు.సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన బాధితులు.. బెంగళూరులో కూలీలుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. వీరంతా దసరా పండుగ కోసం స్వస్థలానికి వచ్చి.. తిరిగి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం తీవ్రతకు టాటా సుమో ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనా స్థలిలోనే ఏడుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు చనిపోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.లారీ కిందికి టాటా సుమో ముందు భాగం చొచ్చుకెళ్లింది. లోపలి చిక్కుకున్న వాహనాన్ని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించిన పోలీసులు. క్రేన్ సాయంతో వెనక్కి లాగారు. బాధితులు లోపల ఇరుక్కుపోవడంతో కట్టర్ సాయంతో తొలగించి, మృతదేహాలను బయటకు తీశారు. బాధితులు గురువారం తెల్లవారుజామునే స్వస్థలం నుంచి బయలుదేరినట్టు స్థానికులు తెలిపారు. ఏపీ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది

Leave A Reply

Your email address will not be published.