గ్రేటర్ హైదరాబాద్ లో 5.70 లక్షల కుక్కలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అంబర్పేటలో పిచ్చికుక్కల దాడిలో 5 ఏళ్ల బాలుడి మృతి ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరమని, చిన్నారి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో 5.70 లక్షల కుక్కలు ఉన్నాయని, అంబర్పేట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాలుడిపై కుక్కల దాడి నేపథ్యంలో అధికారులతో ఆమె అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీధి కుక్కల నిర్మూలన, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంబర్పేట ఘటనపై విజయలక్ష్మి విచారణకు ఆదేశించారు.మేయర్ విజయలక్ష్మీ వ్యాఖ్యలు ఇక్కడివరకు బాగానే ఉన్నా.. బాలుడిని చంపిన కుక్కలకు ప్రతిరోజూ ఓ మహిళ మాంసం పెడుతుండేదని, ఆమె 2 రోజులుగా కనిపించకపోవడంతో ఆకలితో కుక్కలు దాడి చేసి ఉండొచ్చంటూ ఆమె సందేహం వెలిబుచ్చారు. అంతేకాదు.. అన్నింటికీ జీహెచ్ఎంసీదే బాధ్యతని అంటే ఎలా? అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. అత్యవసర భేటీలో ఏం చర్చిస్తారు?.. అంబర్పేట ఘటన నేపథ్యంలో ఎలాంటి చర్యలు ప్రకటిస్తారు?.. బాలుడి కుటుంబానికి ఏవిధంగా చేయూతగా నిలుస్తారని అందరూ ఎదురుచూస్తుండగా ఆమె చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఒకపక్క అన్యాయంగా బాలుడి ప్రాణాలు పోతే ఇంత నిర్లక్ష్యపూరిత సమాధానం చెబుతారా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.