కాంప్లెక్స్ నిర్వాహకులు నిర్లక్ష్యం వల్లే స్వప్నలోక్ అగ్నిప్రమాదం
- కిషన్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అగ్నిప్రమాదం జరిగిన ఫ్లోర్ క్షుణ్ణంగా పరిశీలించారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలు, భవన పటిష్ఠతపై కిషన్ రెడ్డి ఆరా తీశారు. అనంతరం అధికారులతో కిషన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ..‘‘అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం. కాంప్లెక్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రతిఘటనలో పేదలు, అమాయకుల ప్రాణాలే పోతున్నాయి. ప్రమాదాలకు కారకులైన వారిపై GHMC చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. నగరంలోని గోడౌన్లు, స్క్రాప్ దుకాణాలను తనిఖీలు చేయడం లేదు.. ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలు ఉండట్లేదా?. నగరంలో ఉన్న గౌడౌన్లను శివారు ప్రాంతాలకు తరలించాలి. ప్రభుత్వం ఆదాయం కోసం అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోంది. ఆదాయం కోసం అక్రమ భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ప్రమాదం జరిగినప్పుడు తూతూమంత్రంగా కమిటీలు వేస్తున్నారు’’ అని కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.