పాత గూటికి మళ్లీ.. కాంగ్రెస్ వైపు ‘కొండా’ ప్లాన్?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో అసమ్మతులు అసంతృప్తులు మొదలవుతున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన నేత ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరాడు. అందులోనూ పొదగలేక బీజేపీ బాట పట్టారు.  ఇప్పుడు అందులోనూ ఉక్కపోతతో మళ్లీ కాంగ్రెస్ బాట పడుతున్నారు.కొండా విశ్వేశ్వరరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే  అత్యంత ధనవంతుడు అయిన రాజకీయ నేతగా ఉన్నారు.. ఈయన తన ఎన్నికల అఫిడవిట్ లోనే తన ఆస్తులు 900 కోట్లకు పైగా చూపించాడు.    టీఆర్ఎస్ లో ఉన్నా కొండా ఆ తర్వాత కేసీఆర్ వైఖరి నచ్చక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ మారారు.  కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కమలం పార్టీలోకి జంప్ చేశారు.చేవెళ్ల మాజీ ఎంపీ పారిశ్రామికవేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అంటే ఔననే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.ఏ విషయంలోనూ రాష్ట్ర బీజేపీ నేతలు ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనను విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. చేవెళ్లలో సంజయ్ ప్రత్యామ్నాయ నాయకత్వానికి శ్రీకారం చుట్టారని ఆయన అనుమానిస్తున్నారు.అదే సమయంలో ఎంపీ రాహుల్ గాంధీతో సహా ప్రత్యర్థి పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలోని బీజేపీ కేంద్ర నాయకత్వం అదే పనిగా వేధిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టడంపై బహిరంగంగానే కొండా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలను అవలంబిస్తున్నదని.. తన రాజకీయ ఎజెండాను నెరవేర్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని కొండా బహిరంగంగా ఇటీవల వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.ప్రత్యర్థి పార్టీ నేతలను టార్గెట్ చేసేందుకు మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ వీడియోలో అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని ఉదాహరణగా చూపుతూ ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితను కటకటాల వెనక్కి నెట్టాల్సిన రాజకీయ అవసరం ఉంటే మోడీ ప్రభుత్వం ఇప్పటికే చేసి ఉండేదని అన్నారు. “కానీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అది బిజెపికి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఆమెను అరెస్టు చేయడం లేదు” అని కొండా ఆ వీడియోలో అన్నారు.ప్రతిపక్ష పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రభుత్వం కేంద్ర సంస్థలపై ఒత్తిడి తెచ్చిందని కొండా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తూ కొండా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఉటంకిస్తున్నారు.ఆయన పార్టీ మారడం గ్యారెంటీ అంటూ ప్రచారం చేస్తున్నారు.  కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కొండా వ్యాఖ్యలు స్పష్టంగా ఆయన పార్టీ మార్పును తెలియజేస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. విశ్వేశ్వర్ రెడ్డి మాటలను బట్టి ఆయన త్వరలోనే కాంగ్రెస్ లో చేరవచ్చని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.