దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ
- మన డేటాను అమ్మేస్తున్నారు.. సైబరాబాద్ పోలీసులు - స్కామ్ను బయటపెట్టిన సైబరాబాద్ పోలీసులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో అతిపెద్ద సైబర్ స్కామ్ ను సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటా ను చోరీ చేసిన ముఠాను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 16 కోట్ల (16 మంది భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేసి విక్రయించినట్లు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నాగ్పూర్, ఢిల్లీతోపాటు ముంబైకి చెందిన ముఠాగా గుర్తించినట్లు చెప్పారు. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు.‘దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను అపహరిస్తున్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైంది. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్వర్డ్లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. కేటుగాళ్లు ఇన్సూరెన్స్, క్రెడిట్కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్ చేశాం’ అని సీపీ వివరించారు.