సీసీ టీవీ ఫుటేజ్లో దొరికిపోయిన పేపర్ ఎక్సేంజ్ వ్యవహారం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురిలో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకూ మొత్తంగా నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను అధికారులు అరెస్ట్ చేశారు. A1ప్రవీణ్ టీఎస్పీఎస్సీ సెక్రెటరీ పీఏ, A2 రాజశేఖర్, నెట్వర్క్ అడ్మిన్, A10 షమీమ్ ఏఎస్ఓ, A12 రాజశేఖర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అరెస్టైన వారిలో ఉన్నారు.
నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులున్నట్టు రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. 19 మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్ రీపోర్ట్లో సిట్ పేర్కొంది. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా సిట్ పేర్కొంది. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా సిట్ వెల్లడించింది. కర్మన్ ఘాట్లోని ఒక హోటల్లోని యాజమని, ఉద్యోగిని సాక్షిగా సిట్ తెలిపింది. హోటల్లోని సీసీటీవి కెమెరాలో పేపర్ ఎక్సేంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను సిట్ అరెస్ట్ చేసింది. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్స్ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.