మరోసారి విజృంభిస్తోన్న కరోనా..24 గంటల వ్యవధిలో 3 వేల కొత్త కేసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు మూడు వేలకు పైనే నమోదయ్యాయి. గురువారం ఉదయం వరకు 1,10,522 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,016 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. గతేడాది అక్టోబర్‌ 2వ తేదీన 3,375 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,12,692కి చేరింది. కాగా నిన్నటితో పోలిస్తే (నిన్న 2151 కేసులు) కొత్త కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక దేశంలో రోజూవారీ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది.ప్రస్తుతం దేశంలో 13,509 కేసులు యాక్టివ్‌ (Active Cases)గా ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 4,41,68,321 మంది కోలుకున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 14 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకరు, కేరళలో ఎనిమిది మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,30,862గా నమోదైంది.ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.03 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.78 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 (220,65,92,481) కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.