పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ప్రయోగం విజయవంతం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో- మరో ఘనత సాధించింది. పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)లో ఆదివారం పునర్వినియోగ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ ని చేపట్టింది. డీఆర్డీవో, ఇండియన్ ఎయిర్ఫోర్స్తో కలిసి సంయుక్తంగా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ను పరీక్షించినట్లు ఇస్రో తెలిపింది. ప్రపంచంలోనే తొలిసారి రెక్కలున్న లాంచ్ వెహికల్ను హెలికాప్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లినట్లు పేర్కొంది. అనంతరం ఆకాశం నుంచి సురక్షితంగా రన్వేపై ల్యాండింగ్ చేసినట్లు వెల్లడించింది.కాగా, ఆదివారం ఉదయం 7:10 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా తిరిగి వినియోగించే లాంచ్ వెహికల్ (RLV) 4.5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరినట్లు ఇస్రో తెలిపింది. అనంతరం ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్ను ఉపయోగించి దానికదే రన్వేపై ల్యాండ్ అయినట్లు చెప్పింది. చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)లో ఆదివారం ఉదయం 7:40 గంటలకు ఆటోమేటిక్ ల్యాండింగ్ను అది పూర్తి చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు మానవరహిత రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV) అంతరిక్షం నుంచి చాలా వేగంగా, ఖచ్చితత్వంతో వచ్చి భూమిపై ల్యాండ్ అయ్యిందని ఇస్రో తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF), సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్ (CEMILAC), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE), ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADRDE) వంటి సంస్థలు ఈ పరీక్షకు సహకరించినట్లు పేర్కొంది. విజయవంతమైన ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో క్లిప్ను ట్విట్టర్లో షేర్ చేసింది.