తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోసమావేశమయ్యారు. అరగంటకుపైగా సాగిన సమావేశంలో జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. అనంతరం నాదేండ్ల మనోహర్తో కలిసి పవన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాజా రాజకీయాలు, జనసేన-బీజేపీ ఉమ్మడి కార్యాచరణపై చర్చించామని పవన్ తెలిపారు. వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ కోసమే పనిచేస్తామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలవద్దనేదే తన అభిమతమని చెప్పారు. చట్టబద్దమైన విధానాలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గొడవలపై లోతుగా చర్చలు జరిపామన్నారు. అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎలా వెళ్లాలనేదానిపైనే అన్నికోణాల్లో సమాలోచనలు జరుపుతున్నామన్నారు. బీజేపీ-జనసేన రెండు పార్టీలు సంస్థాగతంగా బలోపేతం అయ్యే దానిపై పనిచేస్తామని చెప్పారు. మరికొన్ని చర్చల తర్వాతే పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.పవన్ కల్యాణ్ బుధవారం కూడా ఢిల్లీలోనే ఉంటారు. మరి కొందరు బీజేపీ నేతలను కలుస్తారు.