తిట్టిపోవాడం తప్ప ఆయన రాష్ట్రానికి ఇచ్చింది ఏమి లేదు 

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయిండ‌ని మంత్రులు శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలపై మంత్రులు విరుచుకుపడ్డారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ పాలనను ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోదీకి ఏమీ చేత కాదన్నారు. అదానీ కోసమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కన బెట్టారని, బీజేపీ గతంలో కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు.

ఏ అంశంలోనైనా తెలంగాణతో ఇతర రాష్ట్రాలు పోటీ పడతాయా? అని ప్రశ్నించారు. దేంట్లోనైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందున్నాయా ? అని నిలదీశారు. మోదీ సీబీఐని గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనలేదా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతిపక్షాల తీరును తప్పుబట్టడం సమంజసమా..? కాళేశ్వరానికి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. జాతీయ రహదారులు తెలంగాణ హక్కు అన్నారు. సున్నం వేసి ఇల్లు నాదే అన్నట్టుగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ప్రాజెక్టులు చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయన్నారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారన్నారు. తెలంగాణ మీద మోదీ కక్ష మరోసారి బయటపడిందన్నారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన కాదని, తెలంగాణ అంతా కేసీఆర్ కుటుంబమేనని, మోదీది ఆదానీ కుటుంబమని విమర్శించారు. మోదీ నిధులు ఇవ్వకున్నా పర్వాలేదని, మమ్మల్ని బద్నాం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.