హైదరాబాద్ టు కాశ్మీర్ లోయ స్పెషల్ ట్రైన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వేసవి విడిది కోసం కశ్మీర్ వెళ్లే వారి కోసం రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. మే 11న స్పెషల్ ట్రైన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భారతీయ రైల్వే ప్రారంభించిన ‘భారత్ గౌరవ్ పథకం’లో భాగంగా ‘సౌత్ స్టార్ రైల్’ ఈ నూతన రైల్వే సేవలు అందిస్తోంది. వేసవి విడిది నేపథ్యంలో థీమ్ టూరిస్ట్ ప్యాకేజీలో భాగంగా కశ్మీర్కు ప్రత్యేక రైల్ను ప్రారంభిస్తున్నట్లు సౌత్ స్టార్ రైల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేశ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ట్రైనుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ స్పెషల్ ట్రైన్ కోయంబత్తూర్ నుంచి ప్రారంభమై హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయ చేరుకుంటుందన్నారు. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ టూర్ ఆపరేటర్లను పర్యవేక్షిస్తుందని విఘ్నేష్ వెల్లడించారు. ప్యాకేజీ వ్యవధి 12 రోజులు కాగా.. ఇందులో ప్రత్యేక సదుపాయాలతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్, సైట్ సీయింగ్, భోజన వసతులు అందిస్తున్నామని సౌత్ స్టార్ రైల్ రీజినల్ మేనేజర్ సంతోష్ స్పష్టం చేశారు. బుకింగ్ తదితర సమాచారం కోసం 7876101010 నంబర్కు సంప్రదించాలని సూచించారు.