ప్రభుత్వం పంపిన మూడు బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర

- పెండింగ్ బిల్లులుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ సర్కార్ అసెంబ్లీలో ఆమోదించి తన వద్దకు పంపిన బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంపిన బిల్లుల్లో మూడు బిల్లులకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సోమవారం ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి తిప్పి పంపారు. మరో రెండు బిల్లులను గవర్నర్‌ తమిళిసై రాష్ట్రపతికి పంపారు. గవర్నర్‌ దగ్గర మరో మూడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తాము ఎన్నో రకాల ఉద్దేశాలు, లక్ష్యాలతో బిల్లులను ఆమోదించి పంపితే గవర్నర్‌ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, బిల్లుల్లో స్పష్టత కొరవడిందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం లేదని, అందుకే పెండింగ్‌లో పెట్టాల్సి వస్తోందని రాజ్‌భవన్‌ వర్గాలు ఇన్నాళ్లూ చెప్పుకొచ్చాయి. గత సెప్టెంబరులో జరిగిన శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదించి, అదే నెల 13న గవర్నర్‌ తమిళిసైకి పంపించింది. వాటిలో జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్‌ ఆమోదించారు. మిగతా ఏడింటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ బిల్లుల విషయంలో గవర్నర్ తాజాగా పైన పేర్కొన్న విధంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.