రైతు పాలిట చలిమంటే చితిమంటై

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నిర్మల్:  నిర్మల్ జిల్లా ఎగ్గాంలో దారుణం చోటు చేసుకుంది. చలి తీవ్రతను తట్టుకునేందుకు ఓ రైతు తన పొలంలో వేసుకున్న చలిమంటే అతనికి చితిమంట అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైంసా మండలం ఎగ్గాం గ్రామానికి చెందిన భూమన్న పందుల బారి నుంచి తన పంటను కాపాడుకునేందుకు సోమవారం రాత్రి పొలానికి వెళ్లాడు. చలి తీవ్రత పెరగటంతో చలిమంటే వేసుకున్నాడు. అనంతరం పక్కనే ఉన్న పాకలోని మంచంపై కునుకు తీశాడు. రైతు గాఢ నిద్రలోకి జారుకున్నాక.. చలిమంట ఉవ్వెత్తున ఎగిసి పాకకు నిప్పంటుకుంది. క్షణాల్లోనే మంటలు పాక మెుత్తం వ్యాపించాయి. బయటకు రాలేకపోయిన రైతు భూమన్న కాలి బూడిదైపోయాడు. మర్నాడు ఉదయం వ్యవసాయ పనుల కోసం వచ్చిన పక్క పొలం వారు గమనించి విషయాన్ని భూమన్న కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న వారు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Leave A Reply

Your email address will not be published.