రాష్ట్రంలో భగ్గుమంటున్న భానుడు
- మండుతున్న ఎండలతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్న ప్రజలు - బుధవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవు - రాష్ట్ర వ్యాప్తంగా అరెంజ్ అలెర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. మండుతున్న ఎండలతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. మరోవైపు, బుధవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరిగాయి. దీంతో రాత్రిళ్లు ఉక్కపోత మరింత ఎక్కువకానుంది. అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 39 డిగ్రీల నుంచి గరిష్టంగా 42 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం 23 జిల్లాలకు అరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అప్రమత్తత హెచ్చరికలను జారీ చేశారు. గురువారం అన్ని జిల్లాల్లోనూ సగటున 38-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మధ్య భారతం నుంచి దక్షిణ భారతం వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. పశ్చిమ దిశగా వస్తున్న పొడిగాలులతో వాతావరణం వేడెక్కింది.వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడుతుంది. అలాగే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కనుక వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చమట ఎక్కువ పడుతుంది కనుక సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్డ్రింక్ కు బదులు మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఉత్తమం. ఎండ నుంచి ఇంటికి వచ్చిన వారు నిమ్మరసం తాగాలి. వేసవి ఉపశమనం కోసం కర్బూజ, దోసకాయలు, ఇతర పండ్లను తీసుకోవాలి.సాధ్యమైనంత వరకు నల్లటి దుస్తులు ధరించకుండా బాగా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండడం మంచిది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం 11 గంటలలోపు పని ముగించుకుని ఇంటికి చేరాలి. బయటకు వెళ్లే వారు ఎండ నుంచి రక్షణ కోసం కూలింగ్ గ్లాసెస్, టోపి, హెల్మెట్, గ్లౌజ్ లు వాడాలి. బయటకు వెళ్లే ముందు సన్ స్ర్కీన్ లోషన్ రాసుకోవాలి. మసాలాతో కూడిన ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.