గేర్ మార్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్ గేర్ మార్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు. కేంద్రంలో బలంగా ఉన్న నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలువరించాలంటే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. ప్రతిపక్షాలు కలిసి కట్టుగా ఉంటూ కేంద్రం నుంచి మోదీ సర్కారును సాగనంపాలని నిర్ణయించినట్లు సమావేశానంతరం కేజ్రీవాల్, నితీశ్ చెప్పారు.కేజ్రీవాల్ మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి ధీటైన జాతీయ ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీదేనని కేజ్రీవాల్ విశ్వాసం. ఇదే విషయాన్ని ఆయన అనేక వేదికలపై ప్రకటించారు. ఇప్పటికే ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, గోవా, గుజరాత్‌లో ఉనికి చాటుకుని జాతీయ పార్టీ హోదా కూడా పొందింది. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ నేతృత్వం అనే అంశంపై కేజ్రీవాల్ నితీశ్‌తో ఏకీభవించే అవకాశాలు తక్కువేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.అంతకు ముందు నితీశ్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీరికి స్వాగతం పలికారు. అనంతరం అందరూ గ్రూప్ ఫొటోలు దిగారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించడంపై చర్చించారు. కాంగ్రెస్ అనుకూల పార్టీలతో పాటు కాంగ్రెసేతర పార్టీలను కూడా సంప్రదించాలని నిర్ణయించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరనేదానికన్నా, ప్రతిపక్షాలన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చర్చలు సాగినట్లు సమాచారం.బీహార్‌లో ప్రస్తుతం జేడియూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాఘట్‌బంధన్ సంకీర్ణ సర్కారు కొనసాగుతోంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 74, జేడియూ 43 స్థానాల్లో గెలుపొందగా ఆర్జేడీ 75 స్థానాల్లో, కాంగ్రెస్ 19 చోట్ల, ఇండిపెండెంట్లు 31 మంది గెలిచారు. 2015 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 21 చోట్ల అదనంగా గెలవగా, జేడియూ 28 చోట్ల ఓడిపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడియూ-బీజేపీ ఎన్డీయే సర్కారును ఏర్పాటు చేశాయి. అయితే ఆ తర్వాత కొంత కాలానికి 2022 ఆగస్ట్‌లో నితీశ్ బీజేపీకి గుడ్‌బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశారు.2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి నితీశేనని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. రాహుల్‌పై అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్ధి ఎవరనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వాన్ని ఇష్టపడని అనేక పార్టీలున్నాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే యూపిఏలో కొనసాగుతున్నారు. ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నాయి. స్టాలిన్ కూడా యూపిఏ భాగస్వామిగానే ఉన్నారు. బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ దాదాపు అన్ని కూటములకూ దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి స్పష్టమౌతుంది. ఇక మమత పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌కు దాదాపు ఉనికి లేకుండా చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గెలిచేసరికి బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌కు సహకరించడం వల్లే కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచారని, భవిష్యత్తులో తాను కాంగ్రెస్‌తో చేతులు కలపబోనని స్పష్టం చేశారు.ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారే అన్నట్లుగా ఉండటంతో మున్ముందు నితీశ్‌కు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. అయితే సుదీర్ఘమైన అనుభవమున్న నేతగా, క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా పేరుండటంతో తన చరిస్మాతో విపక్షాలన్నింటినీ నితీశ్ ఏకతాటిపైకి తెస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.