ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పి వచ్చినా సరే పంటి బిగువున భరించి బస్సును సురక్షితంగా పక్కకు ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. కర్నూలు నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గానికి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. గోపాల్ అనే డ్రైవర్ బస్సు నడుపుతున్నారు.. ఇంతలో కళ్యాణ దుర్గం దగ్గర డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది. గోపాల్ బస్సుని అదుపు చేసి ఆపేసి స్టీరింగ్‌పై పడిపోయాడు. స్పృహ కోల్పోయే ముందు డ్రైవర్ చాకచక్యంతో బస్సును పక్కకు ఆపాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 54మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకొన్నారు. ఆ తర్వాత కండక్టర్ ప్రయాణీకుల సహాయంతో డ్రైవర్ గోపాల్‌ను కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే వైద్యం అందించారు.. బీపీ ఎక్కువ కావడంతో డ్రైవర్ స్పృహ కోల్పోయాని చెప్పారు. గోపాల్‌కు ప్రథమ చికిత్స చేసి పంపారు. బస్సును వేరే డ్రైవర్ సహాయంతో డిపోకు తరలించారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడినందుకు డ్రైవర్‌ను పలువురు అభినందించారు..

మరోవైపు అనంతపురం జిల్లాలో టైరు పేలి బస్సు దగ్థమైంది. శింగనమల మండల పరిధిలోని అనంతపురం – తాడిపత్రి రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగగా పూర్తిగా కాలి దగ్ధమైంది. బస్సు బెంగళూరు నుంచి బనగానపల్లెకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారు జామున 3:45 నిమిషాలు సమయంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.