చిక్కుల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డి.

- చిక్కుల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డి. - వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి జగన్ సతీమణి వైఎస్ భారతి పోటీ? - వేరే దారి లేక భారతి వైపే చూస్తున్నారా..?

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. వివేకా కేవలం ఒక మాజీ మంత్రి మాత్రమే అయి ఉంటే ఈ కేసుకు ఇంత ప్రాధాన్యం దక్కి ఉండేది కాదు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సొంత తమ్ముడు కావడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డికి సొంత బాబాయ్ కావడంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఇంత చర్చ జరుగుతోందనేది జగమెరిగిన, జగనెరిగిన సత్యం. 2019 మార్చిలో వివేకా హత్య జరిగితే ఇప్పటికీ ఈ కేసు విచారణ ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఈ కేసు విచారణను ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, అవినాష్ రెడ్డి కూడా దాదాపు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో వైసీపీలో ఓ ఆసక్తికర చర్చ విస్తృతంగా జరుగుతోంది. ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో రాజకీయంగా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. లోక్‌సభ ఎన్నికలు సరిగ్గా సంవత్సరంలో జరగనున్నాయి. ఈ తరుణంలో.. కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు నిలవనున్నారనే చర్చ మొదలైంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. అవినాష్ రెడ్డికి ఈసారి జగన్ హ్యాండివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. చిన్నాన్న హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే కడప ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవడం ఖాయం అనే సంగతి జగన్‌కు తెలియంది కాదు. పైగా.. ఈ కేసులో అవినాశ్ రెడ్డి కూడా జైలుకెళ్లే పరిస్థితులు వస్తే మరింత డ్యామేజ్ జరగడం ఖాయం. ఈ పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు నుంచి ఎవరిని పోటీకి నిలుపుతారోనన్న చర్చ వైసీపీలో పెద్ద ఎత్తున జరుగుతోంది.

1989 నుంచి వైఎస్ కుటుంబంలోని వారే కడప ఎంపీ స్థానంలో గెలుపొందుతూ వచ్చారు. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో జగన్ సతీమణి వైఎస్ భారతి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా.. వివేకా హత్య కేసులో అవినాష్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. వైసీపీ అధినేత జగన్ ముందు వేరే ఆప్షన్స్ కూడా పెద్దగా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్ కుటుంబంలో గతంలో మాదిరి పరిస్థితులు లేవు. జగన్ చెల్లెలు షర్మిల తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ పెట్టుకుని ఏపీ రాజకీయాలకు పూర్తిగా దూరమయిన సంగతి తెలిసిందే. వైఎస్ విజయమ్మ కూడా వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం పాటిస్తున్నారు.

కుటుంబంలో ఏర్పడిన విభేదాల మూలంగా షర్మిల, విజయమ్మను జగన్‌, ఆయన భార్య భారతి దూరం చేసుకున్నారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఈ క్రమంలో.. షర్మిల, విజయమ్మ కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే పరిస్థితులు దాదాపుగా లేవు. వైఎస్ కుటుంబం నుంచి కాకుండా ఇతరులను వైసీపీ అభ్యర్థిగా కడప పార్లమెంట్ స్థానం నుంచి నిలిపితే రాజకీయంగా నష్టం తప్పదని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఇన్ని లెక్కల నడుమ జగన్‌ ముందున్న ఒకేఒక్క ఆప్షన్ వైఎస్ భారతి. వివేకా హత్య కేసులో భారతి ప్రమేయంపై వార్తలొస్తున్నప్పటికీ సీబీఐ ఆమెను ఇప్పటివరకైతే విచారించలేదు. అందువల్ల.. తన భార్యను కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి నిలపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.