తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ఎంతగానో ప్రాధాన్యత
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడలకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్) చైర్మెన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పదిహేడు వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గానికో స్టేడియం నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర క్రీడాకారులు రాణిస్తున్నారని ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంజనేయగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వివాదాలు, నినాదాల వెంట కాదు క్రీడల వెంట నడవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో తెలంగాణ కీర్తిపతాకాలను మన క్రీడాకారులు ఎలుగెత్తి చాటుతున్నారని కొనియాడారు. క్రీడా విజేతలకు సీఎం కేసీఆర్ భారీ ప్రోత్సాహకాలు, నజరానాలు ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. కోట్ల రూపాయల నగదు, విలువైన ఇళ్ల ఆ స్థలాలను బహుమతిగా అందజేస్తూ వారికి అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తున్నారని వివరించారు. ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టి ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి పునాదులు వేశారని కీర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలు గ్రామపునాదుల నుంచి కీలకంగా మారాయని చెప్పారు. అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు సాధ్యమైనట్లే కేసీఆర్ ప్రోత్సాహంతో క్రీడా రంగంలో కూడా అద్వితీయ విజయాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డారు. నిఖత్ జరీన్, త్రిష, ఇషాసింగ్, ప్రణీత లాంటి ఎందరో తెలంగాణ క్రీడాకారులు ఇటీవల ప్రపంచస్థాయిలో విజేతలుగా నిలిచి, తెలంగాణ గర్వపడేలా చేశారని అన్నారు. ఈ స్పూర్తిని తెలంగాణలోని ప్రతీ విద్యార్థి అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ క్రీడా రంగంపై సీఎం కేసీఆర్ రూ.1200 కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పారు. స్పోర్ట్స్ స్కూల్ను బలోపేతం చేయడంతో పాటు స్టేడియంలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడుతూ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తూ క్రీడా భివృద్ధి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. త్వరలో సీఎం కప్ టోర్నీని సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడల ద్వారా ప్రతి ఒక్కరికీ శారీరక, మానసికోల్లాసం “లభిస్తుందని అన్నారు. ఆనందమయ, పరిపూర్ణ జీవితం గడపడం కోసమే ఆటలను కనిపెట్టారని, మనిషి మానసిక, శారీరక ఆరోగ్యం క్రీడల ద్వారానే సాధ్యమని అభిప్రాయపడ్డారు. క్రీడలు జీవితంలో భాగస్వామ్యమవుతేనే ఆరోగ్యంగా ఉండడం సులవవుతుందని చెప్పారు. జీవితంలో ప్రతీ రోజూ క్రీడలు, వ్యాయామానికి సమయం కేటాయించాలని, లేనిపక్షంలో జీవితం నిస్సారంగా మారుతుందని అన్నారు. క్రీడలు ద్వారా మానసిక ఆరోగ్యం పొందడంతో పాటు కుటుంబసభ్యులతో కూడా సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుందని వివరించారు. వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందిన కళాశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత సాయిలు, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హయవదన, ప్రొఫెసర్ వి. సత్యనారాయణ, డాక్టర్ డి. అర్జున్, సర్దార్ జస్పాల్ సింగ్, డాక్టర్ ఎ. పరుశురాం BRSV రాష్ట ఉపాధ్యక్షులు గుండగాని కిరణ్ గౌడ్, తుంగ బాలు, రమేష్, శ్రీమాన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.