కొలువుదీరేందుకు సిద్ధమవుతోన్న రాష్ట్ర సచివాలయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈనెల 30న ప్రారంభించడమే కాకుండా… ఆ రోజు నుంచే కార్యకలాపాలు ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు కొలువుదీరేందుకు రాష్ట్ర సచివాలయం సిద్ధమవుతోంది. కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని కేవలం ఆరు రోజుల గడువు మాత్రమే ఉండటంతో.. సచివాలయ భవనంలోని ముఖ్యమంత్రి చాంబర్, సంబంధిత కార్యాలయం, పేషీని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సందర్శకుల కోసం ప్రత్యేక హంగులతో కూడిన చాంబర్ను సైతం సిద్ధం చేశారు. శాఖల వారిగా గదులను ఎలా విభజించాలన్న దానిపై కసరత్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. శాఖలకు చెందిన మంత్రుల చాంబర్, దాని పక్కనే సంబంధిత శాఖ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి చెందిన చాంబర్లను ఒకేచోట ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక శాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ.. ఒకే చోట ఉంటే.. ఫైళ్ల క్లియరెన్స్, అధికారులతో తరచూ సమావేశం కావడం, శాఖకు చెందిన వ్యవహారాలను క్షణాల్లో చక్కదిద్దే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఆ దిశగానే మంత్రులు, వారికి సంబంధించిన కార్యదర్శులకు చాంబర్లు, గదులను కేటాయించనున్నారు.