ముగిసిన వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్‌ రెడ్డిల సీబీఐ కస్టడీ         

-   కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలింపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్‌ రెడ్డిల సీబీఐ కస్టడీ ముగిసింది. అనంతరం సీబీఐ కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం ఇద్దర్నీ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు అధికారులు హాజరుపరిచారు. ఈ నెల 26 వరకు ఉదయ్‌కు.. 29 వరకు వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు రిమాండ్‌ను విధించింది. కోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డిలను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు అధికారులు తరలించారు. ఇరువుర్నీ చంచల్‌గూడ జైలు అధికారులకు సీబీఐ అప్పగించింది. నేడు కస్టడీ విచారణ చివరి రోజు కావడంతో భాస్కర్ రెడ్డిని చూడటానికి కడప నుంచి కార్యకర్తలు, అభిమానులు కోర్టు దగ్గరికి చేరుకున్నారు. భాస్కర్‌రెడ్డిని కారులో జైలుకు తరలిస్తుండగా ‘సార్.. సార్..’ అంటూ అరవగా అభివాదం చేస్తూ ఆయన వెళ్లిపోయారు. ఇవాళ ఉదయం నుంచీ అనుచరులు, కార్యకర్తలు కోర్టు దగ్గరే ఉన్నారు.

ఆరు రోజుల పాటు ఏం జరిగింది..?

కాగా.. ఇప్పటివరకూ ఇద్దర్నీ 6 రోజులపాటు సీబీఐ కోర్టు కస్టడీకి ఇచ్చింది. ఆరు రోజులపాటు రోజుకు ఆరు గంటల చొప్పున ఈ ఇద్దర్నీ సీబీఐ అధికారులు విచారించారు. ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసులో అధారాల చెరిపివేత కుట్రకోణంపై సీబీఐ ఆరా తీసింది. ఈ కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ ఇద్దరి నుంచి సీబీఐ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విచారణలో పలు కీలక విషయాలను రాబట్టిన సీబీఐ మరోసారి ఈ ఇద్దర్నీ కస్టడీకి ఇస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని.. నాంపల్లి సీబీఐ కోర్టును సీబీఐ తరఫు లాయర్ కోరగా.. భాస్కర్ రెడ్డి, ఉదయ్‌‌లను కస్టడీకి ఇచ్చింది. నాటి నుంచి 6 రోజుల కస్టడీకి తీసుకున్న సీబీఐ.. ఇరువుర్నీ కలిపి విచారించి కీలక విషయాలను రాబట్టినట్లుగా సమాచారం.

Leave A Reply

Your email address will not be published.