తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జమ్మూకశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో ఈ నెల 20న రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై లష్కర్ ఎ తొయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ (దాడి జరిపిన నాటి నుంచి పాకిస్థాన్ భయంతో వణికిపోతోంది. భారత్మరోసారి సర్జికల్ దాడులు జరిపే అవకాశం ఉందని పాకిస్థాన్ ఆర్మీ అనుమానిస్తోంది. ఇప్పటికే భారత్ తమ గగనతలంలోకి జొచ్చుకువచ్చిందని పాక్ సైన్యం వెల్లడించింది. పాకిస్థాన్పై భారత్ సర్జికల్ దాడులు జరిపే అవకాశం ఉందని అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జరపకపోవచ్చని భారత్లో పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ చెప్పారు. ఓ పక్క షాంఘై సహకార సంస్థకు, మరో పక్క జీ20 దేశాలకు భారత్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న తరుణంలో పాకిస్థాన్పై సర్జికల్ దాడులు జరపకపోవచ్చని బాసిత్ అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు భారత్ పాకిస్థాన్పై సర్జికల్ దాడులు జరిపే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదే సమయంలో పూంఛ్లో ఉగ్రవాదులు సైన్యాన్ని లక్ష్యం చేసుకున్నారని, పౌరులను కాదంటూ ఆయన ఉగ్రదాడిని సమర్థించారు.
మరోవైపు పాక్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా ఇటీవల యూకే44 ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ సైన్యం పరిస్థితి దారుణంగా ఉందని, భారత్తో తలపడే పరిస్థితిలో లేదని వెల్లడించడంతో కలకలం రేగింది. పాక్ సైన్యానికి సంబంధించిన వాహనాలకు కనీసం డీజిల్ కూడా అందుబాటులో లేదని, పాక్ ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. దీనిపై పాక్ ఆర్మీ స్పందించింది. యుద్ధం కనుక వస్తే భారత్కు తగిన జవాబు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ఆర్మీకి చెందిన మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెప్పారు. తమ ఎయిర్ఫోర్స్ బలగాలు సదా సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.దీనికి తోడు భారత సైన్యాధికారులు పూంచ్, రాజౌరీలో పర్యటించారు. ఈ సెక్టార్లలో సన్నద్ధతను నార్తెర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టెనెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ పరిశీలించారు. సైనిక బలగాలతో ఆయన మాట్లాడారు. దీంతో పాకిస్థాన్లో అలజడి మరింత పెరుగుతోంది.పూంఛ్లో ఏప్రిల్ 20న పీఏఎఫ్ఎఫ్ జరిపిన దాడిలో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ జవాన్లు చనిపోయారు. సరిగ్గా.. 2021లో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే పీఏఎఫ్ఎఫ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 2019లో అల్ ఖైదా ప్రేరణతో పురుడుపోసుకున్న ఈ ఉగ్రసంస్థ.. జైషే మహమ్మద్కు అనుబంధంగా పనిచేస్తోంది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ రిక్రూట్మెంట్లకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పీఏఎఫ్ఎఫ్ పాత్ర ఉండడం, దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నడంతో కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థపై నిషేధం విధించింది.
2019 ఫిబ్రవరి14న పుల్వామాలో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. దీంతో ఫిబ్రవరి 26న 12 మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్తో ఇండియన్ ఎయిర్ఫోర్స్ బలగాలు పాక్లోని బాలాకోట్లో ఉన్న జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద శిక్షణా కేంద్రాలపై సర్జికల్ దాడులు జరిపి నామరూపాల్లేకుండా చేశాయి. సరిగ్గా ఈ తరహాలోనే భారత్ మరోసారి సర్జికల్ దాడులకు పాల్పడుతుందని పాక్ హడలిపోతోంది.