అనంతపురం జిల్లాలోసిఎం జగన్ కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి జగన్కు అనూహ్యమైన నిరసన వ్యక్తమైంది. కనీసం ఆయన కలలో కూడా ఊహించని విధంగా అనంతపురం జిల్లాలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. సీఎం కాన్వాయ్ ను రైతులు అడ్డగించారు. తమ సమస్యకు పరిష్కారం చూపించాల్సిందేనని పట్టుబట్టారు.దీంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న సీఎం జగన్ పర్యటన రసాభాసగా మారిపోయింది. బుధవారం సీఎం జగన్ అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగానే తమకు న్యాయం చేయాలంటూ.. రైతులు వెంటబడ్డారు.అనంతపురం జిల్లా . సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ బుధవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హలికాప్టర్లో వచ్చారు. తిరిగి కూడా హెలికాప్టర్లో వెళ్లి.. సత్యసాయి జిల్లాలో విమానం ఎక్కాలి.అయితే.. హెలికాప్టర్ మొరాయించింది. దీంతో సీఎం జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి బయలు దేరారు. సీఎం జగన్ పర్యటనలో జరిగిన అనూహ్యమైన మార్పు కారణంగా స్థానికపోలీసులకు కూడా సమాచారం అందలేదు. అయితే.. సీఎం వస్తున్నారని.. ప్రజలకు మాత్రం సమాచారం అందింది.ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద రైతులు సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నించారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ తుంపర్తి మోటుమర్రు ప్రాంతంలో 210 ఎకరాలు సేకరించిన అధికారులు.. ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని రైతులు వాపోయారు.పరిహారం ఇప్పించడంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని తీవ్ర ఆవేదన చెందారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకే వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాన్వాయ్కు అడ్డంగా.. మహిళలు పడుకుని నిరసన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రైతులను పక్కకు లాగేయడంతో సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది.