టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్ల మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. ఉగ్రవాదులు సైనికులపై పేలుడు పదార్థం విసిరారని ఆర్మీ పేర్కొన్నది. ఇటీవల జమ్ము రీజియన్‌లో ఆర్మీ ట్రక్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకొనేందుకు సైన్యం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నది.ఈ క్రమంలో రాజౌరీ సెక్టార్‌ పరిధిలోని కాండి అడవిలో కొంతమంది ఉగ్రవాదులు దాగివున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగివుండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు. దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదంపూర్‌ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలతో మరో ముగ్గురు దవాఖానలో మరణించారని ఆర్మీ పేర్కొన్నది. కాగా, గాలింపు కొనసాగుతున్నదని, అదనపు బలగాలను కూడా రప్పించినట్టు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. టెర్రరిస్టు గ్రూపులో కొంత మంది హతమై ఉంటారని భావిస్తున్నామని ఆర్మీ పేర్కొన్నది.

Leave A Reply

Your email address will not be published.