లోన్యాప్లో రుణం పొందిన వారిని వేదిస్తున్న లోన్యాప్ మోసగాళ్ల అరెస్ట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లోన్యాప్లో రుణం పొందిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు లోన్యాప్ మోసగాళ్లను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కల్పన ఆన్లైనలో లోన్ తీసుకుంది. అయితే కల్పన తీసుకున్న లోన్కు యాప్ నిర్వాహకులు అధిక మొత్తంలో వసూలు చేయడమే కాకుండా ఆమె తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. మార్ఫింగ్ చేసి అశ్లీలంగా కుటుంబ సభ్యులకు, బంధువులకు పోస్టులు పెడతామని బెదిరింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేటకు చెందిన పైడి వెంకట ప్రణయ్తో పాటు, బెంగళూరుకు చెందిన ఇమ్రాన్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. 70 అనుమానిత బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసిన పోలీసులు దాదాపు కోటికి పైగా లావాదేవీలు చేసినట్లు నిర్ధారించారు. వీరిపై డేటాబేస్ ఆధారంగా నాలుగు రాష్ట్రాల్లో కేసు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కేకే అన్బురాజన్ మీడియాకు తెలియజేశారు.