అనుబంధాలు ఏమవుతున్నాయి? ఎటు పోతుంది సమాజం?
.. ట్విట్టర్ లో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆర్టీసి ఎండి సజ్జనార్
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లాలో ఒక తల్లి చనిపోతే, ఆస్పత్రి నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు కన్న కూతుర్లు ఇష్టపడకపోగా.. కనీసం తల్లిని చివరిచూపు చూడడానికి కూడా రాలేదు. పైగా ఆ తల్లి బిచ్చమెత్తుకొని రూ.1.10 లక్షలు పోగేస్తే.. ఆ డబ్బులు ఇప్పిస్తేనే అంత్యక్రియలు చేస్తామని వారు తెలిపారు. ఈ ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జానార్ ట్విట్టర్ వేదికగా సోమవారం స్పందించారు. తల్లిదండ్రుల గురించి ఇలాంటి వార్తలు చదవాల్సి రావడం బాధాకరమన్నారు.
కన్న కూతుర్లే మానవత్వాన్ని మరిచి ఇలా ప్రవర్తించడం దురదృష్టకరమని తెలిపారు. మన ఎదుగుదలకు సోపానం వేసిన తల్లిదండ్రులకు మనమిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ‘‘ఇకనైనా మారుదాం. మన ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులను ఆదరిద్దాం!’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ ఘటనపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి కూతుళ్లు, కొడుకులు ఉన్నా.. చనిపోయిన ఒక్కటే అంటూ ఫైర్ అయ్యారు. డబ్బుకు ఇచ్చే విలువ బందాలకు, బంధుత్వాలకు ఇవ్వకపోవడం శోచనీయం.