త్వరలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జనసేన నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఏపీలో వరుస పర్యటనలు చేస్తున్న పవన్.. ఇటీవల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి, పొత్తుల విషయంలో క్లారిటీ ఇచ్చిన పవన్.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ కీలక ప్రకటన చేశారు. దేశంలోనే దమ్మున్న నేత జనసేనానీ.. అని త్వరలో తిరుపతి నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. వారాహితో తమ సత్తా చూపించి సీఎం కుర్చీని ఆశిస్తామంటూ స్పష్టంచేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా జనసేన నాయకులు, జనసైనికులు వీర మహిళలు సిద్ధంగా ఉన్నామని, రేపు రాబోయే ఎలక్షన్లలో ఆయన వెన్నంటే ఉండి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి.. జనసేన సత్తాను చాటి సీఎం కూర్చిని ఆశిస్తామని పేర్కొన్నారు. ఆదివారం.. ‘జనసేనాని వ్యూహం మా జనశ్రేణుల బాధ్యత’ అనే పోస్టర్ను విడుదల చేశారు. ఈ నినాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులు పాటిస్తారని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.