తెలంగాణ పాఠశాలల్లో ఇక పౌష్టికాహారంతో బ్రేక్ఫాస్ట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయిచింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగి జావా కలిపిన బ్రేక్ ఫాస్ట్ అందజేస్తారు. దీంతోపాటు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తృణధాన్యాలను మధ్యాహ్న భోజనంలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. విద్యార్థుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో బడులకు హాజరవుతున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఈ నేపథ్యంలోనే ఒకటి నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. బలవర్ధకమైన బెల్లం కలిపిన రాగి జావను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇదివరకే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బడుల్లో స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్ల సహకారంతో విద్యార్థులకు రాగిజావను అందజేస్తున్నారు.