తిరుమలలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:తిరుమలలో తెలంగాణకు చెందిన యువకుడి ఆత్మహత్య కలకలంరేపింది. తెలంగాణ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్కు చెందిన భగవంత్రెడ్డి కుమారుడు నరేష్రెడ్డి మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవపడ్డాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులతో కలిసి తిరుమలకు వచ్చాడు. అతడు జీఎన్సీ దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలోని చెట్టుకు ప్లాస్టిక్ నీటిపైపుతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని ఆచూకీ కోసం ప్రయత్నించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అతని దగ్గర ఉన్న కీప్యాడ్ ఫోన్ ఆధారంగా వివరాలు తెలిశాయి.. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతడితో పాటు వచ్చినవారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. వారిని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలిస్తాయంటున్నారు. మృతదేహాన్ని తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇటీవల కాలంలో తిరుమలలో వరుసగా జరుగుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. గతవారం తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర హోటల్లో పనిచేసే ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. సతీష్రెడ్డి అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి పద్మనాభం అనే మరో వ్యక్తిపై కత్తులలో దాడి చేసిన ఘటన కలకలంరేపింది. ఈ ఘటనలతో పద్మనాభంగా తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేసినవారిలో ప్రధాని నిందితుడిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతున్నారు.తిరుమలలో శుక్రవారం నాడు వేద విద్యార్థిపై కత్తితో దాడి కలకలంరేపింది. తిరుమల H.T కాంప్లెక్స్లో.. షర్ట్ కొనుగోలు విషయంలో రమేష్ అనే వ్యక్తితో వేద విద్యార్థి వాగ్వాదానికి దిగాడు. ఆ కోపంతో వేద విద్యార్థిపై రమేష్ కత్తితో దాడి చేశాడు.. గాయపడిన విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది రమేష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా తిరుమలలో మహిళ ఆత్మహత్య కలకలంరేపింది. వరాహస్వామి రెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మరుగుదొడ్డిలో విజయవాడకు చెందిన మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తిరుమలలోని ఓ హోటల్లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు దర్శనానికి వచ్చిన తెలంగాణ భక్తుడు ఆలయంలో ఆనంద నిలయం వీడియోను సమీపం నుంచి మొబైల్లో రికార్డు చేశాడు. ఆ తర్వాత వీడియో వైరల్ కాగా.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు కలకలంరేపుతున్నాయి.