జల్లికట్టు క్రీడకు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జల్లికట్టుక్రీడకు సుప్రీంకోర్టు ఓకే చెప్పేసింది. జంతువుల్లో క్రూరత్వ నివారణ చట్టానికి తమిళనాడు సర్కార్ చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్ధించింది. కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగీ, అనిరుద్ద బోస్, హృషికేశ్ రాయ్, సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. జల్లికట్టు క్రీడలో భాగమైన బర్రెలు, ఇతర పశువులకు అవస్థలు, నొప్పి తగ్గించేందుకే తమిళనాడు సర్కార్ జంతు చట్టంలో సవరణలు చేసినట్లు కోర్టు తెలిపింది. ఆ సవరణలను ఆమోదిస్తూనే.. జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.జల్లికట్టు అంశంలో తమిళనాడు సర్కార్ తీసుకున్న చర్యల్లో లోపాలు లేవని కోర్టు చెప్పింది. అది సాంప్రదాయ క్రీడ అని, రూల్స్ ప్రకారం ఆ క్రీడకు అనుమతి ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. కర్నాటకలో జరిగే కంబాలా, మహారాష్ట్రలో జరిగే బుల్ కార్ట్ రేసింగ్లకు కూడా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.తమిళనాడులో పాపులర్ అయిన జల్లికట్టు క్రీడపై 2014 మేలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. జంతు చట్టాలను ఉల్లంఘించినట్లు అప్పట్లో కోర్టు పేర్కొన్నది. జల్లికట్టు ఆట తమిళనాడు సంప్రదాయం కాదని తెలిపింది. తమిళనాడు జల్లికట్టు నియంత్రణ చట్టాన్ని కూడా సుప్రీం రద్దు చేసింది. అయితే పీసీఏ చట్టం నుంచి జల్లికట్టు ఆటను తొలగిస్తూ 2016లో కేంద్ర సర్కార్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత 2017లో తమిళనాడు ప్రభుత్వం కొత్త జంతు చట్టాన్ని రూపొందించింది.ఆ నోటిఫికేషన్లు, సవరణలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. అయితే ఆ చట్టాలు ఆర్టిల్ 51ఏ(జీ), 51ఏ(హెచ్)ను ఉల్లంఘించలేదని, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను కూడా అతిక్రమించలేదని సుప్రీంకోర్టు తెలిపింది.