తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి మీడియా ప్రతినిధిపై కడప ఎంపీ అవినాశ్రెడ్డి అనుచరుల దాడిని టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మీడియాతో మాట్లాడతూ… న్యూస్ కవరేజ్ చేస్తున్న మీడియాపై దాడిని ఖండిస్తున్నామన్నారు. అవినాశ్ అనుచరులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక సంచలన కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం మీడియా బాధ్యతన్నారు. రాజకీయ నాయకులు ఈ రకంగా బరి తెగించడం మంచి పద్ధతి కాదని అన్నారు. దాడులతో మీడియాను అణచి వేయగలమని అనుకోవడం అవివేకమే అని పేర్కొన్నారు. న్యూస్ కవరేజ్ చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై దాడి చేసి, కెమెరాలు లాక్కొని, మీడియా వాహనాలు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్ వాహనాన్ని అనుసరిస్తున్న మీడియా సిబ్బందిపై అవినాశ్ అనుచరుల దౌర్జన్యం దారుణమని అల్లం నారాయణ మండిపడ్డారు.