ఆర్థిక సంక్షోభంలోకి జర్మనీ
తెలంగాణ జ్యోతి/ వెబ్ నూస్; ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న జర్మనీ ఇప్పుడు ఆర్ధిక సంక్షోభం లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలలు ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం వల్ల జర్మనీ సంక్షోభంలోకి వెళ్లినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత జర్మనీలో గ్యాస్ సరఫరాలు మందగించాయి. దీంతో జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ఆర్ధిక వ్యవస్థ 0.3 శాతం కుంచించుకుపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ట్రేడింగ్లోనూ యూరో విలువ పడిపోవడంతో .. జర్మనీ మార్కెట్లో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. రెండవ క్వార్టర్లో కూడా పర్ఫార్మెన్స్ తగ్గడంతో.. జర్మనీ ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్తున్నట్లు స్పష్టమైంది.ఏప్రిల్లో జర్మనీలో ద్రవోల్యబణం 7.2 శాతంగా ఉంది. ఇది యురో సగటు కన్నా ఎక్కువ. అధిక ధరల భారం ప్రజలపై పడింది. దీంతో ఆహారం, దుస్తులు, ఫర్నీచర్ కొనడం కోసం ప్రజలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. అధిక ఇంధన ధరల వల్ల పరిశ్రమల ఉత్పత్తులకు ఆర్డర్లు తగ్గినట్లు గుర్తించారు. ఏడాది ఆరంభం నుంచి ధరలు అధికంగా ఉండడం వల్ల జర్మనీ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడినట్లు డీస్టాటిస్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.