వింతగా మారిపోయిన వెనిస్
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఇళ్ల మధ్యే వంపులు తిరగుతూ వెళ్లే కాలువలు, వాహనాల తరహాలో కాలవలపై గజిబిజిగా తిరిగేసే పడవలు.. ఇలా వెనిస్ అందాల గురించి ఎంతైనా చొప్పొచ్చు. అందుకే ఇటలీలో ఉండే వెనిస్ (Venice) కు నీటిపై తేలియాడే నగరం అని పేరు.
అయితే ఆదివారం ఆ నగర ప్రజలు లేచి చూసే సరికి వారి కళ్లను వారే నమ్మలేకపోయారు. స్వచ్ఛమైన నీటితో కళకళలాడే వారి ఇంటి ముందు కాలువలన్నీ పచ్చగా మారిపోవడంతో దిగ్భ్రాంతి చెందారు. దీనికి కారణం ఏంటో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. వెంటనే నీటి శాంపిళ్లు తీసుకుని ప్రయోగశాలలకు పంపించారు.
ఇది ఎవరైనా ప్రచారం కోసం చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తామని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ వారాంతంలో నగరంలో జరగనున్న వోల్గొలొంగ రెగట్ట అనే పడవ పోటీలను లక్ష్యంగా చేసుకుని ఈ తుంటరి చేష్ఠకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు.
[embedded content]
పర్యావరణ ప్రేమికుల పనేనా?
వెనిస్లోని వృద్ధులు మాత్రం ఇది తమకు 1968ని గుర్తు చేస్తోందని చెబుతున్నారు. అప్పట్లో వెనిస్కు వచ్చిన అర్జెంటీనా పర్యావరణ ప్రేమికుడు, కార్యకర్త అయిన నికోలస్ గార్సా ఉరిబురు అనే వ్యక్తి ఇలానే ప్రఖ్యాత గ్రాండ్ కెనాల్లో పచ్చ రంగుని కలిపాడు. దీంతో ఆ సరస్సు మొత్తం ఇప్పటిలాగే పచ్చగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
పర్యావరణం పట్ల అందరికీ స్పృహ కలిగించడానికే అతడు అలా హానికరం కాని రంగు నీళ్లలో కలిపాడని చెబుతున్నారు. ఇలా నీళ్లకు రంగులు కలపడం అక్కడక్కడా జరుగుతున్నదే.. ఇటలీలోనే రోమ్లో ఉన్న ప్రఖ్యాత ట్రెవీ ఫౌంటెన్ నీటిని ప్రభుత్వంపై నిరసనగా ఆందోళనకారులు పూర్తి నలుపు రంగులోకి మార్చేశారు.