తెలంగాణ పది సంవత్సరాల పసికూన..
- మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోంది : సీఎం కేసీఆర్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పసికూన అయిన పది సంవత్సరాల తెలంగాణ.. మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ.. కేంద్రం నుంచి అనేక అవార్డులను అందుకుందని కేసీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభించుకున్న అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
ఈ రోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం చేసిన పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం. పరిపాలన సంస్కరణల కోసం నూతన కలెక్టరేట్లను నిర్మించుకున్నాం. సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టే మంచిర్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు మంచి జరగాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం.ఆసిఫాబాద్ కలెక్టరేట్ను కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్లో ఉందన్నారు. ప్రజలకు వారధిగా ఉద్యోగులు పని చేయడంతో, మంచి ఫలితాలను సాధించాం. తెలంగాణ ఎన్నో విషయాల్లో నంబర్ వన్గా ఉంది. అనేక రికార్డులను నెలకొల్పాం. కరోనా, నోట్ల రద్దు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. కష్టకాలంలోనూ తెలంగాణ అభివృద్ధిలో ముందుంది. కులమతాలకు అతీతంగా అందరి సంక్షేమానికి కృషి చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తున్న అధికారులకు అభినందనలు. కులవృత్తులకు ఆర్థిక సాయం పథకాన్ని, రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని మంచిర్యాల నుంచే ప్రారంభించుకోబోతున్నాం. గొర్రెల పెంపకంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆరోగ్య శాఖ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. మాతాశిశు మరణాలు తగ్గాయి. కంటి వెలుగు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్లో కూడా ఆ ముఖ్యమంత్రులు కూడా అమలు చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు.