నిమ్స్ నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిమ్స్ నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలో అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానగా నిమ్స్ ముందు వరుసలో నిలువన్నది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.సీఎం కేసీఆర్కు ప్రత్యేక అనుబంధం2009లో ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు నిమ్స్లోనే వైద్యం అందించారు. ఆనాటి నుంచి నిమ్స్తో సీఎం కేసీఆర్కు మంచి అనుబంధం ఉన్నది. నిమ్స్కు అన్ని రకాల హంగులు ఉన్నా.. అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకే ఏటా రూ.100 కోట్లు కేటాయించి నిమ్స్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాటను అమల్లోకి తెస్తూ మొదటి ఏడాదే 2014-15లో రూ.185 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా నిమ్స్కు నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. 2022లో నిమ్స్కు రూ.242 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.290 కోట్లు కేటాయింపులు జరిపారు. ఇప్పుడు నిమ్స్ విస్తరణకు నడుం బిగించారు.
నిమ్స్ దవాఖాన 2014కు ముందు అరకొర వసతులుతో కొట్టుమిట్టాడేది. తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశంలోనే అత్యుత్తమ దవాఖానల్లో ఒకటిగా మారింది. 2014 నాటికి దవాఖానలో 900 పడకలు మాత్రమే ఉండేవి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ సంఖ్యను 1489కి పెంచారు. అంటే స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే పడకల సంఖ్య 65% పెరిగింది. 2014 నాటికి 111 మంది బోధనా సిబ్బంది ఉండగా నిరుడు చివరినాటికి ఈ సంఖ్య 264కు పెరిగింది. రెసిడెంట్ డాక్టర్లు గతంలో ఏటా 82 మందిని కేటాయించగా, ప్రస్తుతం 169 మందిని కేటాయిస్తున్నారు.