రాష్ట్రంలో వైసీపీ నేతలు పంచ భూతాలను మింగేశారు
- ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైంది..ఇక తరిమికొట్టడమే మిగిలింది - భయపెట్టి ఎక్కువ కాలం రాజ్యం ఏలలేరు.. టీడీపీ అధినేత చంద్రబాబు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో వైసీపీ నేతలు పంచ భూతాలను మింగేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కుప్పంలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో టీడీపీ అధినేత మాట్లాడుతూ… ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైందని…ఇక తరిమికొట్టడమే మిగిలిందన్నారు. భయపెట్టి ఎక్కువ కాలం రాజ్యం ఏలలేరని.. ఉత్తరకొరియా నియంత కిమ్ సోదరుడే జగన్ అని అన్నారు. పులివెందులలో భయపెట్టి గెలుస్తున్నారని.. కుప్పంలో ప్రజల అభిమానంతో గెలుస్తున్నామని తెలిపారు. హుదూర్ తుఫాన్కు భయపడని విశాఖ….వైసీపీ అక్రమార్కులకు వణికిపోతోందన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే తన లక్ష్యమన్నారు. ఆదరించిన ప్రజలపై అదే తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రజల ఇళ్లపైనా ఈ రాక్షసులు పడతారని తాను ముందుగా చెపితే నమ్మలేదని.. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది కదా అని అన్నారు. విశాఖలో జరిగిన వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వైజాగ్లో నేటి పరిస్థితులకు ఒక ఉదాహరణ అని అన్నారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాల్సిన బాధ్యత సీనియర్ నేతగా తనకు ఉందని తెలిపారు. 4 దశాబ్దాలుగా తనను ప్రజలు ఆదరిస్తున్నారని.. రాష్ట్రాన్ని గాడిన పెట్టి వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందరిలా భయపడి తాను రాష్ట్రాన్ని వదిలేస్తే.. రాష్ట్రం పూర్తిగా నాశనం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితి వస్తే ఎక్కువ బాధపడేది తానే నని చంద్ర బాబు అన్నారు.