ఏపి మంత్రి అప్పలరాజుపై మావోయిస్టులు ఆగ్రహం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. గతంలో మావోయిస్టు పార్టీ పంపిన లేఖపై చర్యలు తీసుకుంటామని మంత్రి అప్పలరాజు చెబుతుండటం సరికాదన్నారు. తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని హెచ్చరించారు. గతంలో చంద్రబాబుపై తాము దాడి చేశామని.. అలాగే మాధవరెడ్డిని హత్య చేశామని మావోయిస్టులు గుర్తు చేశారు. తమకు వైసీపీ అయినా తెలుగుదేశమైనా ఒకటే అన్నారు. ప్రజల మేలు కోసమే తాము పనిచేస్తామన్నారు. ఈ మేరకు ఆంధ్ర-ఒడిశా బోర్డర్ కమిటీ వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గతంలో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈసారి విప్లవ యువజన సంఘం (వైవీఎస్) కార్యదర్శి అశోక్ పేరిట లేఖ వచ్చింది. తాము గతంలో విడుదల చేసిన లేఖపై మంత్రి అప్పలరాజు దుష్ప్రచారం మానుకోవాలని తాజా లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. అదేవిధంగా మంత్రికి వత్తాసు పలుకుతున్న ఓ రెండు పత్రికల యాజమాన్యాలు కూడా పద్ధతి మార్చుకోవాలన్నారు. తమ నిబద్ధతను ప్రశ్నించడంపై  ఆ లేఖలో మావోయిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రజాసంఘాల నాయకులుగా చెలామణి అవుతున్న దుష్ట చతుష్టయం మంత్రికి లోపాయికారిగా ఇస్తున్న సలహాలు సూచనలు సహకారాలు మానుకోవాలని హితవు పలికారు.మావోయిస్టుల లేఖ యథాతథంగా ఇలా ఉంది…  ‘ ప్రియమైన ప్రజలారా విప్లవాభిమానులారా మంత్రి సీదిరి అప్పలరాజు ఆయన అనుయాయులు చేస్తున్న భూదందాని బయటపెట్టి వారు అక్రమంగా ఆక్రమించిన రామకృష్ణాపురం సూదికొండ నెమలికొండ తదితర భూముల నుంచి తక్షణమే వైదొలగాలని ఆ భూములు ఈ ప్రాంత పేద ప్రజలకే చెందాలని ప్రజల తరపున మాట్లాడిన మావోయిస్టు పార్టీ పైన ఆపార్టీ ఆంధ్ర -ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీపైన మంత్రి అప్పలరాజు సోషల్ మీడియాలో విరుచుకుపడడం పార్టీ పంపిన లెటర్ను ప్రచారం చేసిన వారిపై చర్యలు ఉంటాయని భయపెట్టడం అతని దివాళాకోరు రాజకీయాలకు పరాకాష్ట‘ అని మావోయిస్టులు ఆ లేఖలో మండిపడ్డారు.మంత్రి సీదిరి అప్పలరాజుకు వత్తాసు పలుకుతున్న చిక్కోలు పేపర్ జగదీష్ జనం ఈవెనింగ్ పేపర్ రమణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ తెలుగుదేశం హయాంలో జరిగినవాటికి మావోయిస్టు పార్టీ నోరు ఎందుకు విప్పలేదని నోరు పారేసుకున్నారు. అప్పుడు మాట్లాడని పార్టీకి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదని కూడా కితాబిచ్చారు అంటూ మావోయిస్టులు లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో దాడి విషయం ఇదే జిల్లాలో ఎంపీ కింజరాపు ఎర్రంనాయుడుపైన దాడి విషయం హెూం మంత్రి మాధవ రెడ్డిని అంతమొందించిన విషయం తెలిసి మాట్లాడుతున్నారో లేక తెలియక మాట్లాడుతున్నారో అంటూ మావోయిస్టులు లేఖలో ధ్వజమెత్తారు.దోపిడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఏ రాజకీయ పార్టీ అయినా అది వైసీపీ కావచ్చు లేదా తెలుగుదేశం కావొచ్చు. ఏదైనా మావోయిస్టు పార్టీ ముందు ఒక్కటే అని గుర్తుంచుకోవాలి. ఎక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటాయో అక్కడ మావోయిస్టు పార్టీ పేదప్రజల తరఫున నిలబడి మాట్లాడుతుందన్నది జగమెరిగిన సత్యం. మావోయిస్టు పార్టీ సభ్యులు ప్రజల కోసమే జీవిస్తారు. ప్రజల కోసమే మరణిస్తారు. ఇదే నడుస్తున్న చరిత్ర… ఆ లేఖలో మావోయిస్టులు ఘాటుగా స్పందించారు.మహాత్తర త్యాగాల బాటలో పయనిస్తున్న మావోయిస్టు పార్టీపై మంత్రి వాని అనుచరులు ఇక్కడ మావోయిస్టు పార్టీ ప్రజా సంఘాల నాయకులుగా చెలామణి అవుతున్న దుష్ట చతుష్టయం (పోతనపల్లి అరుణ జోగి కోదండం పత్తిరి దానేసు కొర్రయి నీలకంఠం) లోపాయికారిగా ఇస్తున్నసూచనలు సలహాలు సహకారంతో చాలా దురహంకారపూరితంగా నోటికి వచ్చినట్లు వాగడం అధికార మదంతో విర్రవీగడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీరి అకృత్యాలకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని మరచిపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాగే దుష్ట చతుష్టయం వీరి వీరి పద్ధతులు మార్చుకోవాలని లేని యెడల ప్రజల కోపానికి గురికాక తప్పరని తెలియజేస్తున్నాం అంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.వీరి దోపిడీ దౌర్జన్యాలకు ముగింపు పలికి ప్రజలకు క్షమాపణ చెప్తే చరిత్ర క్షమిస్తుంది. లేనియెడల చరిత్రలో ప్రజా శత్రువులకు పట్టిన గతే వీరికీ పట్టక మానదు. అప్పుడు వీరిని ఆదుకోడానికి ఎవ్వరూ ఉండరు. ఇదే చారిత్రక సత్యం. అందుకే వీరు ఇప్పటికైనా మించిపోయింది లేదని గుర్తించడం మంచిది. అలాగే ప్రజలకోసం పనిచేస్తున్న మావోయిస్టు పార్టీపై వీరు పన్నుతున్న కుతంత్రాలను చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించవలసినదిగా ప్రజలను కోరుతున్నాం అంటూ విప్లవ యువజన సంఘం ఆంధ్ర-ఒడిశా బోర్డర్ కమిటీ అశోక్ కార్యదర్శి పేరిట లేఖ వైరల్ అవుతోంది.నేరుగా మంత్రి సీదిరి అప్పలరాజుకు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ లేఖపై దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.