తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ట్రీట్మెంట్ అవసరం
- ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ఇప్పటికే చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో లోలోపల రగిలిపోతున్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ట్రీట్మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పెను దుమారాన్నే రేపారు. ఓ చిన్న వీడియో ద్వారా తెలంగాణ నాయకత్వంపై జితేందర్రెడ్డి తన అసంతృప్తినంతా వెళ్లగక్కారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలో ఎక్కించడానికి ట్రై చేస్తుంటాడు. అది ఎక్కకుంటే వాటి సీటుపై ఒక్క తన్ను తంతాడు. వెంటనే అది ట్రాలీ ఎక్కుతుంది.సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా అవసరమని జితేందర్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ను అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలకు ట్యాగ్ చేశారు. అయితే జితేందర్ రెడ్డి కాసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశారు. తెలంగాణలో బీజేపీ నాయకత్వం పని తీరు ఏమాత్రం బాగోలేదని ఆయన చెప్పకనే చెప్పారు. అలాగే తెలంగాణ బీజేపీ నాయకత్వంపై జితేందర్ రెడ్డి ఎంత అసహనంతో ఉన్నారనేది ఈ ట్వీట్ను చూస్తే అర్ధమవుతోంది. మరోవైపు బీజేపీపై బహిరంగంగా జితేందర్ రెడ్డి ఇంత అసంతృప్తిని వెళ్లగక్కారంటే.. ఆయనేమైనా పార్టీ మారుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.