తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం పొన్నం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… రైతాంగం, వ్యవసాయం బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. వర్షం బాగా పడి తొందరగా వ్యవసాయ పనులు ప్రారంభించే విధంగా ఆశీర్వాదించాలని స్వామి వారిని కోరినట్లు తెలిపారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి హామీలు నేరవేర్చలేదని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలంతా మార్పును కోరుతున్నారని తెలిపారు. దేశంలో, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని ప్రజలు మార్పు కోరుకుంటే.. ఇక్కడ కూడా మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. అనేక హామీలను తెలంగాణ ప్రభుత్వం నేరవేర్చలేని పక్షంలో ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో ప్రజల్లో మరింత ఊపు వచ్చిందన్నారు. దేశంలో అన్ని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నరేంద్ర మోదీని గద్దె దించాలని భావిస్తున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.