జూలై 8న వరంగల్లో ప్రధాని పర్యటన
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 8న వరంగల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.అలాగే వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు 8న హైదరాబాద్లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.