తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే

-  అసలు సినిమా ముందుంది :మంత్రి కేటీఆర్‌ - వచ్చే ఎన్నికల్లో 95 -100 సీట్లు గెలుస్తాం - చూమంతర్‌ అనంగనే అభివృద్ధి జరగలేదు - ఒక్కడుగు బయటకు వెళ్లొస్తే మన అభివృద్ధి తెలుస్తది - ఒక్కడుగు బయటకు వెళ్లొస్తే మన అభివృద్ధి తెలుస్తది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ జర్నీ ఇప్పుడే మొదలైందని.. కేసీఆర్‌ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్‌రామ్‌గూడలో క్రెడాయి కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జానపద గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సాయిచంద్‌కు నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ 95 నుంచి 100 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాటలు చెప్పడం ఈజీనే కానీ.. తొమ్మిదేండ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణ ఎక్కడికి వచ్చిందో ఆత్మవలోకనం చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మాటలు చెబుతున్న ఓ ప్రతిపక్ష పార్టీయేమో 50 ఏండ్లు అధికారం చలాయించినవాళ్లేనని.. ఇంకో ప్రతిపక్షమేమో ఢిల్లీలో 9 ఏండ్లుగా పాలిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వాళ్ల మాటలేమో కోటలు దాటుతాయి కానీ కాళ్లు మాత్రం కడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. కరెంట్‌ సమస్య పరిష్కారం అలకటి పని అయితే 50, 60 ఏండ్లుగా ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. తాగునీటి, సాగునీటి సమస్యలు అలకటి పనే అయితే ఎందుకు పరిష్కారం కాలేదని అడిగారు. 60 ఏండ్లలో కాని పనులు తొమ్మిదేండ్లలో పూర్తికావడానికి సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో 95 -100 సీట్లు గెలుస్తాం

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో జరిగిన ఎన్నికల్లో 63 సీట్లే వచ్చాయి. ఒక్క 10 మందిని అటు ఇటు చేస్తే వెంటనే ప్రభుత్వం ఆగమైతది.. తెలంగాణ ఫెయిల్డ్‌ ఎక్సపర్మెంట్‌ అవుతదని తెలంగాణ వ్యతిరేకులు చాలా ప్రయత్నాలు చేశారు.’ అని గుర్తు చేశారు. ‘కొంతమంది రాజకీయ నాయకులకు క్లారిటీ ఉండకపోవచ్చు.. కానీ ప్రజలకు క్లారిటీ ఉంటుంది. జేబులో 100 నోటు ఉంటే.. దాని కింద పడేసి.. రోడ్డు మీద చిల్లర నాణేలు ఎవరూ ఏరుకోరు. అలాగే మంచిగ పనిచేసే ప్రభుత్వాన్ని పిచ్చోళ్లు కూడా వదులుకోరు. కాబట్టే మొదటి ఎన్నికల్లో 63 సీట్లతో గెలిస్తే.. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో గెలిచాం. 2023లో జరిగే ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాల్లో గెలుస్తామని సంపూర్ణ విశ్వాసం ఉంది.’ అని ధీమా వ్యక్తం చేశారు.

చూమంతర్‌ అనంగనే అభివృద్ధి జరగలేదు

డోంట్‌ టేక్‌ థింగ్స్‌ సో గ్రాంటెడ్‌ అని తేలిగ్గా తీసుకోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. అంతా బాగుంటుంది.. ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.. ఎవరున్న ఎట్లే ఉంటది అని అనుకోవడం తప్పు అని హితవు పలికారు. ‘ ఎవరు ఉన్న ఇట్లే ఉంటే.. 2014 కంటే ముందు పరిస్థితి బాగోలేదు. ఎందుకు కరెంట్‌ బాగోలేదు. ఎందుకు తాగు నీరు బాగోలేదు. ఎందుకు సాగు నీరు బాగోలేదు. ఎందుకు మార్కెట్‌ బాగోలేదు. ఇప్పుడెందుకు బాగైంది. ఉత్తగనే అనామతుగా అయిపోయిందా? ఉత్తగనే చూమంతర్‌ అనంగనే.. కూర్చొని టైమ్‌పాస్‌ చేస్తుండంగనే పనులు అయినయా?’ అని ప్రశ్నించారు.

ఒక్కడుగు బయటకు వెళ్లొస్తే మన అభివృద్ధి తెలుస్తది

గచ్చిబౌలి, కొండాపూర్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోని పెద్ద బిల్డింగ్‌లు చూసి ఇది హైదరాబాదా? న్యూయార్క్‌ నగరమా అని అనిపించిందని సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చెప్పారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. ‘ రజినీకాంత్‌ ఉండేది మనకంటే పెద్ద నగరమైన చెన్నైలో.. ఆయన సూపర్‌ స్టార్‌… వంద దేశాలు తిరిగి ఉంటండు. మరి ఆయనకు హైదరాబాద్‌ను చూస్తే అలా అనిపించింది. ఆయన ఒక్కడికే కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన ఇది ఇండియానేనా అని ఆశ్చర్యపోయారు. వేరే ఏదో దేశంలో ఉన్నామని అనుకున్నట్లు చెప్పారు’ అని అన్నారు. హైదరాబాద్‌, తెలంగాణలో ఉన్నోళ్లకే ఇక్కడి పరిస్థితి అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వాళ్లు ఒక్కడుగు బయటకు పోయి మళ్లొస్తేనే మన కథేంటో అర్థమైతదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రకో, కర్ణాటకకో గుజరాత్‌కో, ఇంకో రాష్ట్రానికో వెళ్లి అక్కడ పది రోజులు ఉండొస్తే మన రాష్ట్రం గొప్పదనం అర్థమవుతుందని అన్నారు. ఇంటి కోడి.. పప్పుతో సమానం అన్నట్టుగా మన సత్తా, మన ప్రభుత్వ పనితీరు ఇక్కడి వాళ్లకు అర్థం కావడం లేదని అన్నారు.

కేసీఆర్‌ పాలనలో ఆ రెండూ ఉన్నాయి

తొమ్మిదేండ్లలో చూసింది ట్రైలర్‌ మాత్రమేనని.. అసలు సినిమా ముందుంది.. తొందరపడకండని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇదేదో ఎన్నికల్లో లాభం కోసం చెప్పడం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ జర్నీ ఇప్పుడే మొదలైందని.. ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నామని.. సీఎం మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు ఉన్నప్పుడు ప్రొ ఐటీ, ప్రొ బిజినెస్‌ టైప్‌లో పాలన ఉండేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కాదు.. సీఈవో అంటే ఆయనకు నచ్చేదని గుర్తు చేశారు. రాజశేఖర్‌ రెడ్డికి ప్రొ ఫార్మర్‌, ప్రొ పూర్‌, ప్రొ రూరల్‌ ఇమేజ్‌ ఉండేదన్నారు.  కానీ కేసీఆర్‌ పాలనలో ఆ రెండూ ఉన్నాయని.. అదే కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేకత అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.