వైసీపీ అధినేతకు బైరెడ్డి అల్టిమేటం జారీ చేశారా..?
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రూపంలో పెద్ద చిక్కు వచ్చి పడిందా..? వైసీపీ అధినేతకు అల్టిమేటం జారీ చేశారా..? మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గం.. ఈ నాలుగింటిలో ఎక్కడో ఒకచోట పోటీకి దింపుతున్నట్లు ప్రకటిస్తే సరే లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తేల్చిచెప్పేశారా..? ఇన్నిరోజులు పార్టీకి సేవలు చేసిన తగిన గుర్తింపు, ఇచ్చిన పదవితో సంతృప్తిగా లేరు.. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంట్లో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమే అని తెలుస్తోంది. ఇంతకీ బైరెడ్డి ఇంత కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? యువనేత కోరుతున్న ఆ నియోజకవర్గాలేంటి..? ఒకవేళ ఆ నాలుగింటిలో ఏదో ఒక సీటు ఇచ్చినా అక్కడున్న సిట్టింగ్ల పరిస్థితేంటి..? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది..?
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. యూత్లో ఈయనకున్న క్రేజే వేరు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ యువనేతకు భారీగా అభిమానులున్నారు.. ఈయన సభ పెట్టినా, ఇంటి నుంచి బయటికొచ్చినా వందలాది మంది అభిమానులు, అనుచరులు వచ్చేస్తుంటారు. యూత్లో ఇంత క్రేజ్ ఉందిగనుకే దాన్ని క్యాష్ చేసుకోవడానికే అప్పట్లో బైరెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించి కండువా కప్పారు జగన్. మొదట అనుకున్నంత ప్రియారిటీ లేకున్నప్పటికీ ఆ తర్వాత ఏదో కాస్తో కూస్తో ప్రాధాన్యత ఉన్న శ్యాప్ బాధ్యతలను జగన్ కట్టబెట్టారు కానీ.. రోజుకో వివాదం తప్పితే ఇంతవరకూ క్రీడలను ఉద్దరించిన దాఖలాల్లేవ్. దీంతో బైరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. తన సేవలను నియోజకవర్గం, జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకుంటూ.. కనీసం చట్టసభలకు కూడా పంపరా..? ఇదేం న్యాయం అని అధిష్టానాన్ని బైరెడ్డి నీలదీశారట. అందుకే రానున్న ఎన్నికల్లో కర్నూలు సిటీ, పాణ్యం, శ్రీశైలం ఈ మూడింటిలో ఏదో ఒకచోట టికెట్ ఇవ్వాలని.. కుదరని పక్షంలో నంద్యాల ఎంపీ సీటు అయినా సరే ఇవ్వాలని.. ఇవేవీ ఇవ్వని పక్షంలో కీలక నిర్ణయమే తీసుకోవాల్సి వస్తుందని డైరెక్టుగా జగన్కు అల్టిమేటం జారీచేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి చట్టసభల్లోకి అడుగుపెట్టాలని ఈసారి గట్టిగానే బైరెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నది వ్యక్తమవుతుంది