మణిపూర్ లో మళ్ళీ చెలరేగిన హింస
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమాన్తాబి గ్రామంలో సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై దుండగులు దాడి చేశారు.
ఆదివారం అర్ధరాత్రి సమయంలో కొండలపై నుంచి గ్రామంలోకి ప్రవేశించిన దుండగులు.. ముగ్గురు గ్రామ వాలంటీర్లను చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసు బలగాలు అక్కడికి చేరుకునే లోపే దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు. అయితే దుండగులను పట్టుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి.
కాగా, 2 నెలల క్రితం మూసివేసిన 2వ నంబర్ జాతీయ రహదారిని కుకీ తెగలు తెరిచాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు కంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి దిగ్బంధాన్ని విరమించుకున్నట్లు కుకీ తెగలకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్, కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ స్పష్టం చేశాయి. మణిపూర్లో రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇంఫాల్ నుంచి దిమాపూర్ వరకు ఎన్హెచ్-2, ఇంఫాల్ నుంచి జిరిబామ్ వరకు ఎన్హెచ్ 37 ఉన్నాయి. రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు హైవేలను కుకీ తెగ నిరసనకారులు మూసివేశారు.