జగన్ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగుదేశం పార్టీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ 145వ రోజు యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా లో విజయవంతంగా సాగుతోంది. సోమవారం ఉదయం అనిల్ గార్డెన్స్లో ‘మహాశక్తితో లోకేష్’ పేరిట మహిళలు, యువతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమ్మని మించిన దైవం లేదని, మహిళలకు అవకాశాలు కల్పిస్తే, ప్రపంచాన్ని జయించగలరని అన్నారు.ఎన్టీఆర్ మహిళల కోసం యూనివర్శిటీ ఏర్పాటు చేశారని, ఆస్థిలో సగభాగం హక్కు కల్పించారని లోకేష్ అన్నారు. చంద్రబాబు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని, బాబు సీఎంగా ఉన్నంత కాలం మహిళలు, యువతుల వైపు చూడాలన్నా భయపడేవారని, జగన్ ప్రభుత్వంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. మద్యపాన నిషేధం అమలుచేస్తానని చెప్పి.. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి వీధిలో మద్యం పారేలా చేశారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తనకు చెల్లెలు లేదనే లోటు ఉండేదని, అమ్మ నన్ను క్రమశిక్షణతో పెంచారని, మొన్న పొరపాటున ఓ మాట అంటే, ఫోను చేసి అమ్మ తిట్టారని, మహిళలని గౌరవించాలనే మనస్సు ప్రతి ఒక్కరికీ ఉండాలని అన్నారని లోకేష్ తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువత ఎక్కువగా నష్టపోయారన్నారు. పరిశ్రమలు, ఉద్యోగాలు లేవు, శాంతి భద్రతలు లేవని అన్నారు. రాష్ట్రంలో గంటకు ఇద్దరిపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, ఇక మహిళా మంత్రులు అయితే మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రోజా ఒక అంశంలో తనకు చీరా, గాజులు పంపిస్తామన్నారని, చీరా, గాజులు ధరించే వారి పట్ల అంత చిన్నచూపా? అని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గంలో దళిత మహిళని చంపేస్తే చర్యలు లేవని ఆరోపించారు.అంగన్ వాడీ నుంచి పీజీ వరకు మహిళలను గౌరవించాలనే బాధ్యత పెంపొందేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో అందరికీ ఒక్కటే చట్టం అమలయ్యేదని, జగన్ ప్రభుత్వంలో కొందరికి చట్టాలు చుట్టాలవుతున్నాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కొన్ని వీధి కుక్కలను తయారు చేసిందని అన్నారు. అసభ్యకరంగా పోస్టింగ్లు పెట్టే వారెవ్వరినీ వదలమని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని అవమానిస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, ఆమె బయటకు రారని, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని చెప్పారు. ఈ రోజుకూ వైసీపీ నేతలు అవమానిస్తూ ఉంటారని, ఇది ఎంత వరకు న్యాయమో ఏపీలో మహిళలందరూ ఆలోచించాలన్నారు. తన తల్లి పడే బాధ మరే తల్లి పడకూడదని అన్నారు. శాసనసభలో చంద్రబాబుని అవమానిస్తే.. సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు.