అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం
- పార్టీ కార్యకర్తలతో బండి సంజయ్ - రాష్ట్రంలో బీజేపీ సారథ్యంపై కొనసాగుతున్న సస్పెన్స్ - నాయకత్వం ఆలోచన నేడో రేపో వెల్లడయ్యే చాన్స్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 8వ తేదీన వరంగల్లో జరిగే ప్రధాని మోదీ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హాజరౌతానో లేదోనని బండి సంజయ్ ఆదివారం హన్మకొండలో కార్యకర్తలతో అన్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలను బండి సంజయ్ నుంచి తప్పించి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారని.. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమిస్తారని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ పార్టీ కేడర్లో జోష్ నింపే ఆయన.. ఆదివారం ముభావంగా ఉండిపోయారు. 8న ప్రధాని మోదీ వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి అక్కడ ఏర్పాట్లను సమీక్షించిన సంజయ్.. అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. వరంగల్లో జరిగిన మీడియా సమావేశంలో తన సహజశైలికి భిన్నంగా ముక్తసరిగా మాట్లాడారు.అనంతరం, ఎన్జీవో కాలనీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కార్యకర్తలు, నాయకులు సంజయ్కి మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో, వారిని ఉత్తేజపరుస్తూ కొద్దిసేపు మాట్లాడారు. ప్రధాని సభను సక్సెస్ చేసి చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. అనంతరం, కరీంనగర్ వెళ్లిపోయారు. ఒకవేళ పార్టీ రాష్ట్ర బాధ్యతల నుంచి తనను తప్పించినా.. అధైర్యపడవద్దని బండి సంజయ్ తనను అభిమానించే కార్యకర్తలు, నాయకులకు బండి నచ్చజెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేస్తున్నారు. అయితే, బండివల్లే తెలంగాణలో బీజేపీకి గ్రామీణ స్థాయి వరకు విస్తరించిందని, పోరాట స్ఫూర్తితోనే గ్రామాల్లో అధికార పక్ష నేతల అరాచకాలను ఎదుర్కొన్నామని కార్యకర్తలు ఆదివారం ఆయనతో అన్నారు. బండినే అధ్యక్షుడిగా కొనసాగించాలంటూ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. బండి సంజయ్ మనస్తాపానికి గురైన విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని.. దీనిపై వారి నిర్ణయం ఏమిటో ఒకటి, రెండు రోజుల్లోనే తేలిపోతుందని.. కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఈ సస్పెన్స్ త్వరలోనే తెరపడుతుందని.. పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.
ఛుగ్ ప్రకటించినా తప్పుడు ప్రచారం: విజయశాంతి
వచ్చే ఏడాది పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే దాకా బండి సంజయే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారని రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ తరుణ్ఛుగ్ స్పష్టంగా ప్రకటించినా ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష మార్పు లేదని, నాలుగు రోజుల కిందట కూడా తరుణ్ఛుగ్ పునరుద్ఘాటించారని ఆమె గుర్తుచేశారు. సంజయ్ని మారుస్తున్నారంటూ ప్రచారం చేసేవాళ్లు, అందుకు కారణం ఏంటో మాత్రం చెప్పడం లేదని విజయశాంతి పేర్కొన్నారు. ఇక.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై తనతో ఎవరూ చర్చించలేదని బీజేపీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు.