ఎన్నికల సమర సన్నాహాల్లో మునిగి తేలుతున్న అధికార, ప్రతిపక్షాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి అధికార, ప్రతిపక్షాలు సమర సన్నాహాల్లో మునిగి తేలుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్తుండడం.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటన చేపట్టడంతో పాలకపక్షం వైసీపీ కూడా జనంలోకి వెళ్లడానికి సమాయత్తమైంది. సీఎం జగన్మోహన్రెడ్డి ఇటీవల తమ పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో వర్క్షాపు నిర్వహించారు. ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం కింద నెల రోజులపాటు ఇంటింటికీ తిరగాలని ఆదేశించారు. వలంటీర్లు, గృహ సారథుల సాయంతో ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలో ఎమ్మెల్యేలకు వివరించారు. జనంలో తిరగకపోతే ఈసారి టికెట్లు ఇవ్వనని హెచ్చరించారు. దీని తర్వాత ‘మళ్లీ జగనే ఎందుకు కావాలి’ అని మరో కార్యక్రమం తలపెట్టారు. దానికి రెండ్రోజుల ముందు టీడీపీ రాష్ట్ర స్థాయి సర్వ సభ్య సమావేశం నిర్వహించింది. మహానాడులో ప్రకటించిన ప్రాథమిక మేనిఫెస్టోను ‘భవిష్యత్కు గ్యారెంటీ’ పేరుతో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించి.. అదే రోజు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ బస్సులను ప్రారంభించారు. నెల రోజులపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రలు జరిపి మేనిఫెస్టోకు మంచి ప్రచారం కల్పించడం ఈ యాత్రల ఉద్దేశం. దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో సీనియర్ నేతల ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు బస్సు యాత్రలు చేస్తున్నారు. ఈ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమం మొత్తం 150 రోజులపాటు ఉంటుంది. బస్సు యాత్ర తర్వాత పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో గ్రామాలవారీ సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉంటుంది. గత కొన్ని నెలల నుంచి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం రకరకాల పేర్లతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించగా.. టీడీపీ ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాలను నిర్వహించింది. వైసీపీ హయాంలో ప్రజలపై పడిన భారాలను, వేసిన పన్నులను, పెరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ కార్యక్రమాలకు సమాంతరంగా పార్టీల అధినేతలు కూడా విస్తృతంగా ప్రజల్లో పర్యటిస్తున్నారు. టీడీపీ యువ నేత లోకేశ్ గత నాలుగు నెలలుగా విరామం లేకుండా పాదయాత్ర జరుపుతున్నారు. అనేక వర్గాల ప్రజలతో సమావేశమై వారి సమస్యలు వినడం.. పరిష్కారానికి హామీ ఇవ్వడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఆయన గట్టిగా ఎండగడుతున్నారు. మొదట్లో ఈ పాదయాత్రను పెద్దగా పట్టించుకోని అధికార పక్షం.. దానికి పెరుగుతున్న స్పందన చూశాక ఎదురుదాడి చేస్తోంది. చంద్రబాబు కూడా జిల్లాలు చుట్టేస్తున్నారు. రాజమండ్రి మహానాడుకు ముందు ఆయన ప్రతి వారం ఒక జిల్లాలో పర్యటించి రోడ్షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మహానాడు తర్వాత వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని కొంత తగ్గించారు. జూలై నుంచి మళ్లీ పర్యటనలు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా గత కొంత కాలంగా పర్యటనల జోరు పెంచారు. వివిధ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల పేరుతో ఏదో ఒక నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ఈ సభలకు ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, కాలేజీల బస్సులు పెద్ద ఎత్తున వినియోగించి డ్వాక్రా సంఘాల సభ్యులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను భారీగా తరలించి తమకు ప్రజాదరణ తరగలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గడప గడపకు నిరసన వ్యక్తమవుతుండడంతో ‘జగనన్నకు చెబుదాం’తో ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎవరి వ్యూహం వారిది..
ఎన్నికల తేదీ వెలువడే వరకూ గుప్పిట విప్పబోదని అనుకునే టీడీపీ మొదటిసారిగా పది నెలల ముందు తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించింది. సంక్షేమ పఽథకాలను వైసీపీ కంటే తామే ఎక్కువ ఇస్తామని చాటుకునేందుకు ఆకర్షణీయ పథకాలకు రూపకల్పన చేసింది. ప్రజల్లో మరింత చర్చించి వచ్చే దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక వైసీపీ ప్రభుత్వం తనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ‘జగనన్నకు చెబుదాం’, ‘జగనన్న సురక్ష’ పఽథకాలను ముందుకు తెచ్చింది. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి ఒక పథకం, ఆ ఫిర్యాదులు ఎంత వరకూ పరిష్కారం అయ్యాయన్నదానిపై పరిశీలనకు రెండో పఽథకాన్ని చేపట్టింది. కొన్ని సమస్యలైనా పరిష్కారమైతే వ్యతిరేకత కొంత తగ్గుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, వివిధ వర్గాల్లో పార్టీ గ్రాఫ్ ఎలా ఉందన్నదానిపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సర్వేలు కూడా మొదలు పెట్టాయి. దీనికి సమాంతరంగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా జరుగుతోంది. తమ సిటింగ్ ఎమ్మెల్యేల్లో 18 మంది పనితీరు బాగోలేదని ముఖ్యమంత్రి జగన్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందన్న సంకేతాలిచ్చారు. అయితే బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య దీనికి రెట్టింపు ఉందని వైసీపీ వర్గాల్లో వినవస్తోంది. వారి స్థానంలో కొత్త ముఖాల కోసం అన్వేషణ జరుగుతోందని అంటున్నారు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో 8 మంది సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినాయకత్వం కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై నిశితంగా కసరత్తు చేస్తోంది. ఇంకా 25 నియోజకవర్గాలపైనే తమ నాయకత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందని, మిగిలిన చోట్ల అభ్యర్థులపై ఇప్పటికే అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చిందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జనసేనతో పొత్తు అంశం పరిశీలనలో ఉండడంతో ఆ పార్టీ అధినాయకత్వం కొన్ని నియోజకవర్గాల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. కొత్త వారికి కనీసం 40శాతం టికెట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి అనుగుణంగా మాజీల్లో బలహీనంగా ఉన్నవారిని పక్కన పెట్టాలని యోచిస్తోంది. జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ రెండు నెలలుగా సిటింగ్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల సన్నద్ధత, నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై చర్చిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు.
వారాహిపై పవన్..
అధికార, ప్రతిపక్షాలకు దీటుగా జనసేన కూడా ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. వారాహి పేరుతో ప్రత్యేక ప్రచార వాహనం తయారు చేయించుకున్న పవన్కల్యాణ్ ఇప్పటికే తన పర్యటనలు ప్రారంభించారు. బహిరంగ సభలకే పరిమితం కాకుండా మార్గమధ్యంలో వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ హామీలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పర్యటనల ద్వారా తమ పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను ఉత్తేజపరచి ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ మూడు ప్రధాన పార్టీలు క్షేత్ర స్థాయిలో పనిచేయడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో కూడా బలం చాటడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం వారి పోరాటం డిజిటల్ రంగానికి కూడా విస్తరించింది. పరస్పర విమర్శలు, ఎదుటివారిపై ఎత్తి పొడుపులు, వ్యంగాస్త్రాలతో సామాజిక మాధ్యమ రంగం ఇప్పటికే కోలాహలంగా మారింది.