మైక్రోచిప్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన కేటీఆర్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కోకాపేటలో మైక్రోచిప్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాస్కామ్ ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్లోనే సృష్టించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని మంత్రి కేటీఆర్ అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని చెప్పారు. లైఫ్సైన్సెస్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశానికి లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉందన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ హైదరాబాద్లో ఉందని వెల్లడించారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ తన వర్క్ఫోర్స్ను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోందన్నారు. వచ్చే దశాబ్ధంలో ఆ రంగంలో భారత్ దూసుకెళ్తుందన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి మందికి స్వంత ఖర్చులతో శిక్షణ ఇస్తోందన్నారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కిలింగ్ రంగంలో కూడా తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందన్నారు.