ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక నిర్ణయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాల భర్తీకి పీహెచ్డీ తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. ఆ ఉద్యోగాల మార్గదర్శకాల్లోని పీహెచ్డీ నిబంధనను తొలగిస్తున్నట్లు యూజీసీ ప్రకటించింది. ఈ నిర్ణయం జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది యూజీసీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఆయా అభ్యర్థులు నెట్, సెట్, స్లెట్ పరీక్షల్లో అర్హత సాధిస్తే చాలని తెలిపింది.దేశంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పోటీ పడాలంటే పీహెచ్డీని తప్పనిసరి చేస్తూ 2018లో యూజీసీ నిబంధనలు జారీ చేసింది. దీంతో ఆ నిబంధనలు దేశ వ్యాప్తంగా 2018, జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా ఆ నిబంధనలను యూజీసీ సవరించింది. ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్డీ డిగ్రీ తప్పనిసరి కాదని యూజీసీ స్పష్టం చేసింది. బోధన పట్ల ఆసక్తి కగిలి ఉండి, పీహెచ్డీ డిగ్రీ లేని ఎంతో మంది అభ్యర్థులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించింది.